జ్వరానికి అమృతారిష్ట

ABN , First Publish Date - 2020-10-27T17:59:53+05:30 IST

ఆయుర్వేదంలో బహుళ ప్రాచ్యుర్యం పొందిన ఔషధాలలో అమృతారిష్ట ఒకటి. అమృతారిష్టలో ప్రధానంగా తిప్పతీగ ఉంటుంది. తిప్పతీగనే గుడూచి, గిలాయ్‌, సంస్కృతంలో అమృతవల్లి అంటారు.

జ్వరానికి అమృతారిష్ట

ఆంధ్రజ్యోతి(27-10-2020)

ఆయుర్వేదంలో బహుళ ప్రాచ్యుర్యం పొందిన ఔషధాలలో అమృతారిష్ట ఒకటి. అమృతారిష్టలో ప్రధానంగా తిప్పతీగ ఉంటుంది. తిప్పతీగనే గుడూచి, గిలాయ్‌, సంస్కృతంలో అమృతవల్లి అంటారు.


పురాతన ఆయుర్వేద గ్రంథమైన భైషజ్యరత్నావళి, జ్వరాధికార అధ్యాయంలో అమృతారిష్ట తయారీ, ఉపయోగం గురించి వివరించబడింది. ఆయుర్వేదిక్‌ ఫార్ములేటరీ ఆఫ్‌ ఇండియా (ఎ.ఎ్‌ఫ.ఐ), ఆయుర్వేదిక్‌ ఫార్మకోఫియా ఆఫ్‌ ఇండియా (ఎ.పి.ఐ)లో ఇవ్వబడింది.


అమృతమయం...

అమృతారిష్టను ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పినట్టుగా అరిష్ట విధానంలో తయారుచేస్తారు. దీన్లో ప్రధాన మూలిక అమృతవల్లి లేదా తిప్పతీగ. దీంతో పాటు దశమూల, త్రికటు, కటుకరోహిణి మొదలైన 23 రకాల మూలికల సంకలనంతో ఈ ఔషధం తయారుచేస్తారు. ఇది అన్నిరకాల జ్వరాలకు ఉపయోగించదగినది. ముఖ్యంగా పైత్యదోషం వల్ల కలిగే జీర్ణజ్వర ధాతుగత జ్వరాలలో బాగా పనిచేస్తుంది.


రక్తపైత్యం, హార్మోన్‌ అసమతౌల్యం, విటమిన్‌ లోపం, అగ్ని మాంద్యం (అజీర్ణం), యాకృతి (కాలేయం), ప్లీహం (స్ల్పీన్‌) పనితీరును మెరుగుపరుస్తుంది. పైత్యసంబంధమైన దోషాల వల్ల తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పితో పాటు దాంతో వచ్చే వాంతులు, ఆకలి మందగించడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలకు ఇది బాగా పనిచేస్తుంది. రక్తపైత్యం వల్ల వచ్చే కేన్సర్‌ను తగ్గించడానికి ఉపయోగకారిగా ఉంటుంది.


డోసు...

దీన్ని పెద్దలు ఉదయం, సాయంత్రం 10 మిల్లీలీటర్ల చొప్పున, పిల్లలకు వైద్యుల సూచనమేరకు వాడుకోవాలి. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్‌, బైద్యనాధ్‌, డాబర్‌ వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.           


శశిధర్‌

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల.

Updated Date - 2020-10-27T17:59:53+05:30 IST