మెడికల్ షాపుల దందాకు చెక్
ABN , First Publish Date - 2021-12-04T04:58:19+05:30 IST
ప్రజల ప్రా ణాలను కాపాడే ఔషధాల అమ్మకాలపై డ్రగ్ కంట్రోల్ సంస్థ నజర్ పెట్టింది. ఎవరు పడితే వారు మెడికల్ షా పులను నిర్వహించడం ఇకపై సులువు కాదు. ఫార్మసీ చ దివిన వారి పేరుతో మెడికల్ షాపులు తెరిచేవారికి ఇక కాలం చెల్లినట్టే.
వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా అమ్మితే కఠిన చర్యలు
షాపు ఏ ఫార్మసీ డిగ్రీ హోల్డర్ పేరిట ఉందో.. అతడే షాపులో ఉండాలి
షెడ్యూల్-హెచ్ రకం ఔషధాల అమ్మకాలను రికార్డు చేయాలి
డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ తాజా ఆదేశాలు
వరంగల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ప్రా ణాలను కాపాడే ఔషధాల అమ్మకాలపై డ్రగ్ కంట్రోల్ సంస్థ నజర్ పెట్టింది. ఎవరు పడితే వారు మెడికల్ షా పులను నిర్వహించడం ఇకపై సులువు కాదు. ఫార్మసీ చ దివిన వారి పేరుతో మెడికల్ షాపులు తెరిచేవారికి ఇక కాలం చెల్లినట్టే. అర్హులైన ఫార్మసిస్టులు లేకుండా షాపులను నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవంటూ డ్రగ్ కంట్రో ల్ డైరెక్టర్ మీనా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
మెడికల్ షాపుల నుంచి మత్తు పదార్థాలను తీసుకుంటున్న అగంతకులు నేరాలకు పాల్పడుతుండడం, దీంతోపాటు ప్రాణాలను నిలబెట్టే కొన్ని డ్రగ్స్ను బ్లాక్ మార్కెట్ చేస్తుండడంతో డ్రగ్ కంట్రోల్ అథారిటీ కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్-19కు సంబంధించిన మందులను గత రెండు వేవ్లలో మెడికల్ షాపులకు చెందినవారు బ్లాక్ దందా చేసిన విష యం తెలిసిందే. ఇటీవల వైద్య,ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన్నీరు హరీశ్రావు మెడికల్ షాపుల దందాలపై దృష్టి సారించారు. బాధ్యత లేకుండా విచ్చలవిడిగా మందులను ఎవరికి పడితే వారికి అమ్ముతుండడంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో సర్ప్రైజ్ దాడులు నిర్వహించాలంటూ డిసెంబరు 1న డ్రగ్ ఇన్స్పెక్టర్లకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్, కాస్మోటిక్స్ యాక్టు రూల్ 65(2) ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రిజిస్టర్లు ఉండాల్సిందే..
రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలో ఓ మిల్లుకు చెందిన బావిలో మత్తు మందు కలిపి తొమ్మిది మందిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఓ మెడికల్ షాపు వారు స్లీపింగ్ పిల్స్ను ఓ అనామకుడికి ఎలాంటి ప్రిస్ర్కిష్షన్ లేకుండా అమ్మడమే ఆ హత్యలకు కారణమైంది. షెడ్యూల్ హెచ్ రకానికి చెందిన మందులను సైతం డాక్టర్ చీటీ లేకుండానే మెడికల్ షాపుల్లో విక్రయాలు జరుపుతున్నారు. దీనిని అరికట్టేందుకు ఇక నుంచి షెడ్యూల్ హెచ్ రకానికి చెందిన డ్రగ్స్ను విక్రయించే ముందు తప్పనిసరిగా ప్రత్యేకంగా రిజిస్టర్లో స్టాకును ఇన్, అవుట్ను వివరాలను పొందుపరిచేలా చూడాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా తీవ్రతను తగ్గించడానికి ఉపయోగించే రెమిడిసివర్ వంటి డ్రగ్స్ బ్లాకులో విక్రయించకుండా ఉండేందుకు లెక్కను పక్కాగా చేయాలని డ్రగ్ కంట్రోల్ సంస్థ భావిస్తోంది.
ఫార్మసిస్టులు లేనివి 40 శాతంపైనే..
మెడికల్ షాపుల్లో పట్టాలున్న ఫార్మసిస్టులు కనిపించకపోవడం రొటీన్గా మారింది. ఫార్మసీ పట్టాలను రెం ట్కు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులు ఫార్మసిస్టు లేకుండానే మందుల షాపులను నిర్వహిస్తున్నారు. కొందరు వైద్యు లు మెడికల్ షాపులను తమ క్లినిక్లలో అనుబంధంగా పెట్టుకుంటున్నారు. ఫార్మసీ పట్టాను అద్దెకు తీసుకుంటు న్న అనర్హులు గల్లీల్లో కుప్పల కొద్దీ షాపులను ఏర్పాటు చేస్తూ బ్లాక్ దందాకు తెరతీస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జో గుతుండడంతో కేటుగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి.
నోటీసుల జారీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులను నిర్వహిస్తున్న 32 మెడికల్ షాపులకు రెండురోజుల క్రితం డ్రగ్ ఇన్స్పెక్టర్లు నోటీసులను జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యా ప్తంగా 1,622 మెడికల్ షాపులు, 390 మెడికల్ ఏజెన్సీలు నమోదు అయి ఉన్నాయి. ప్రతీ మెడికల్ షాపులో పట్టాలో ఉన్న పేరు ఉన్న ఫార్మసిస్టు లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 వేలకు పైగానే మెడికల్ షాపులున్నాయి. ప్రైవేటు నర్సింగ్ హోమ్స్, ఆస్పత్రులు మార్కెట్లలో షాపులు అన్ని కలిపి సుమారు 2వేలకు పైగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జయశంకర్ జిల్లాల్లో ఉన్నాయి. అనధికారికంగా మరో 500 షాపులు గల్లీల్లో ఏర్పాటు చేసి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.