దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు బంద్!
ABN , First Publish Date - 2021-12-29T08:46:06+05:30 IST
నీట్ పీజీ కౌన్సెలింగ్ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఢిల్లీలో రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జికి నిరసన
న్యూఢిల్లీ, డిసెంబరు 28: నీట్ పీజీ కౌన్సెలింగ్ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ ఆస్పత్రి నుంచి సుప్రీం కోర్టు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలపాలని వైద్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైద్యులకు మధ్య వాగ్వాదం జరిగిందని, పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని వైద్యులు ఆరోపించారు. మహిళా వైద్యులనూ పురుష పోలీసులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు వైద్యులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు అఖిల భారత వైద్య సంఘం(ఎ్ఫఏఐఎంఏ) పిలుపునిచ్చింది. ఉదయం 8 గంటల నుంచి విధులకు దూరంగా ఉండాలని కోరింది.
ఇది.. బ్లాక్ డే!
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని, వైద్యులను నిర్బంధించడాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్వోఆర్డీఏ) ఖండించింది. మంగళవారాన్ని ‘బ్లాక్ డే’గా ప్రకటించింది. ఇప్పటికే కొందరు వైద్యులను పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఆస్పత్రుల మూసివేతకు సోమవారమే ఎఫ్వోఆర్డీఏ పిలుపునిచ్చింది. తమపై పోలీసులు జులుం ప్రదర్శించారని, చేయి చేసుకున్నారని నిరసనలో పాల్గొన్న పలువురు మహిళా వైద్యులు ఆరోపించారు.