కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-05-28T05:51:31+05:30 IST

తెలంగాణలోని సర్కారు దవాఖానాలను కార్పొరేట్‌స్థాయిలో సేవలు అం దించే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వాసు పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు

కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు
మెదక్‌లో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేందాన్ని ప్రారంభిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలి

ప్రజల ఆరోగ్య పరిరక్షణ మన బాధ్యత

ప్రతి నెలా మూడో తారీఖున ‘ఆశా’లతో టెలీకాన్ఫరెన్స్‌

బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థుల ఇంటికి మందులు

సాధారణ కాన్పులకు వైద్య సిబ్బందికి రూ.3 వేల ఇన్సెంటీవ్‌

త్వరలో మెదక్‌ జిల్లాలో రైలు కూత

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు


మెదక్‌అర్బన్‌, మే 27: తెలంగాణలోని సర్కారు దవాఖానాలను కార్పొరేట్‌స్థాయిలో సేవలు అం దించే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వాసు పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం మెదక్‌లో రూ.17కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.  అనంతరం దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పట్టణంలో 100 పడకల ఎంసీహెచ్‌ను ప్రారంభించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నిరకాల హంగులతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని ఆనందం వ్యక్తం చేశారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దవాఖాన నిర్మాణానికి ఎంతో చొరవ చూపారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ఆశావర్కర్లల బాధ్యత తీసుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వాసుపత్రుల్లో 30 శాతం ఉంటే ప్రస్తుతం 56 శాతానికి పెరిగిందన్నారు. ఆశావర్కర్లు గర్భిణులను ప్రభుత్వాసుపత్రికి తీసుకురావాలని కోరారు. నార్మల్‌ డెలివరీలు జరిగేలా గర్భిణులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. పేదలు, ప్రైవేట్‌ దవాఖానాలకు వెళ్లి అప్పులపాలు కావొద్దని మంత్రి సూచించారు.  సీఎం కేసీఆర్‌ ఆంగన్‌వాడీల ద్వారా ఆరోగ్యలక్ష్మి కింద పౌష్టికాహారం అందిస్తున్నామని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినపుడు ఆశావర్కర్లకు 1500 జీతం ఉంటే.. సీఎం కేసీఆర్‌ వారికి రూ.9,500కు పెంచారన్నారు. ప్రజల ఆరోగ్యపరిరక్షకులు ఆశావర్కర్లు అంటూ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేస్తే రూ. 3వేల పారితోషం ఇస్తామని మంత్రి వెల్లడించారు. వైద్యపరీక్షలు, స్కానింగ్‌ సౌకర్యం ప్రభుత్వాసుపత్రుల్లో జరగాలని, ప్రైవేటుకు పంపొద్దని సర్కారు ఆరోగ్యసేవలను బలోపేతం కోసం సమష్టిఘా పనిచేద్దామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆశా కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు అందిస్తున్నామన్నారు. బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మందులన్నీ ఇంటికి కిటలను అందజేస్తున్నామన్నారు. ప్ర భుత్వ ఆసుపత్రుల్లో పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉండాలన్నారు. మందుల కొరత లేకుండా వైద్యాధికారులు చూడాలన్నారు. అమ్మఒడి వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. దళిత బంధు అనేది పథకం కాదని ఒక ఉద్యమం అని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 16 శాతం దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. మెదక్‌ జిల్లాలో 256 మందికి గ్రౌండింగ్‌ చేస్తున్నామని మంత్రి తెలిపారు. మెదక్‌లో వైద్యకళాశాల ఏర్పాటుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 


త్వరలో మెదక్‌కు రైలు 

మెదక్‌ పట్టణానికి త్వరలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఎంసీహెచ్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  పనులన్నీ పూరైయ్యాయని, గూడ్స్‌ రైలు ద్వారా ఎరువులు, వరి ధాన్యాన్ని తీసుకరావడం.. తీసుకెళ్లడం వంటి జరుగుతాయన్నారు. రైలువస్తే ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నారు అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్‌లో మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను అభివృద్ధి చేసినట్లు మెదక్‌ జిల్లా అభివృద్ధికి మంత్రి  ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అనంతరం రాందాస్‌ చౌరస్తాలో రూ.3 కోట్లతో నిర్మించనున్న మున్సిపల్‌ దుకాణ సముదాయానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్ధాపన చేశారు. పాత ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్స్‌ డెవల్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, రమేష్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హేమలత, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఎస్పీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, యువజన సర్వీసుల శాఖ జనరల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజు, జిల్లా ఆసుపత్రి డీసీహెచ్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ శివదయాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


 ఏర్పాట్లు.. అధికారుల తీరుపై మంత్రి అసహనం

మెదక్‌ పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం పిల్లికొట్టాల్‌ శివారులో నూతనంగా నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఎంసీహెచ్‌కు వెళ్లేదారిలో రోడ్డు నిర్మించకపోవడం... తదుపరి పర్యటన వివరాలను తెలియజేయకపోవడం, భోజన ఏర్పాట్లు సరిగా లేకపోవడం వంటి విషయాల్లో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డితో ఏర్పాట్ల లోటుపాట్లపై చర్చించారు. అంతకుముందు దళితబంధు యూనిట్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతున్నప్పుడు కార్యక్రమం మధ్యలో వైద్యవిధాన పరిషత్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజా వచ్చారు. ఏం తల్లి కాన్పుల సంఖ్య వివరాల కోసం ఫోన్‌ చేస్తే ఇప్పటి వరకు ఇవ్వలేదు.. ఇప్పుడేందుకు వచ్చారు.. రేపు వస్తే అయిపోతుండే కదా అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని, అధికారులు నిర్లక్ష్యంతో డాటా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. 


సర్కార్‌ దవాఖానకు, సర్కార్‌ బడికి క్రేజ్‌

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), మే 27: ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించడం.... మంత్రి, కలెక్టర్‌ వచ్చి గుమ్మడికాయ కొట్టి కుండలు పెట్టి మిమ్మల్ని ఇళ్లలోకి పంపడం నిజంగా చాలా అదష్టమంటూ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మనోహరాబాద్‌ మండలం రామాయపల్లిలో 80, కోనాయపల్లి (పీటీ)లో 25 ఇళ్లను మంత్రి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. సర్కారు నౌకరీ అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో సర్కారు బడి, సర్కారు దవాఖానకు అంతే క్రేజ్‌ రాబోతుందన్నారు. రామాయపల్లి, కోనాయపల్లి (పీటీ)లలో మంత్రి హరీశ్‌రావు గృహ ప్రవేశాలు  చేసి ఇళ్లలోకి వెళ్లారు. రెండు గ్రామాల్లో పేదలకు మరిన్నీ ఇళ్లను మంజూరు చేశారు. సర్పంచులు బాషబోయిన ప్రభావతి నర్సింహులు, రావెల్లి పార్వతీమల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌, అదనపుకలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, ఫాక్స్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పురం నవనీతా రవి, వైఎ్‌సఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్‌, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌, సర్పంచులు చిట్కుల్‌ మహిపాల్‌రెడ్డి, నత్తి మల్లేశ్‌, తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:51:31+05:30 IST