రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్‌ ఉచితంగానే..

ABN , First Publish Date - 2020-10-24T08:16:24+05:30 IST

రోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ ఎప్పుడొచ్చినా తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగానే అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్‌ ఉచితంగానే..

ముందుగా వైద్య సిబ్బందికి.. తర్వాత పేదలకు

వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ ఎప్పుడొచ్చినా తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగానే అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. బిహార్‌ ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామన్న బీజేపీ హామీపై ఆయన స్పందించారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. రాష్ట్రంలో ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి తొలి ప్రాధాన్యంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తదుపరి పారిశుద్ద్య సిబ్బందికి అందజేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి అని, వారి గురించే నిత్యం ఆలోచిస్తారని, అందుకే వైద్య సిబ్బంది తర్వాతి ప్రాధాన్యం పేదలకే ఇస్తామని చెప్పారు.


ముఖ్యంగా రోజువారీ కూలీలకు టీకాలు అందిస్తామని వెల్లడించారు. అనంతరం అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరదలు వస్తే... చలించిపోయిన సీఎం కేసీఆర్‌ వెంటనే ఆర్థిక సాయం ప్రకటించారని, గతంలో ఏ సీఎం కూడా ఇలా తక్షణ నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవని గుర్తు చేశారు. కరోనా టీకాల విషయంలో కూడా తమ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. టీకాలకు సంబంధించిన కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని కోరారు.

Updated Date - 2020-10-24T08:16:24+05:30 IST