వెలంపేటలో వైద్య శిబిరం ఏర్పాటు
ABN , First Publish Date - 2021-12-07T06:12:26+05:30 IST
కె.పెంటపాడు వెలంపేట రామాలయం వద్ద అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
పెంటపాడు, డిసెంబరు 6: కె.పెంటపాడు వెలంపేట రామాలయం వద్ద అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వణికిస్తున్న డెంగీ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి వైద్య యంత్రాంగం స్పందించింది. ఇంటింటా సర్వే చేసి జ్వరపీడితుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా పెంటపాడు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ శిరీష మాట్లాడుతూ కె.పెంటపాడులో వైరల్ జ్వరాల వల్ల ప్లేట్ లెట్స్ పడిపోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్య లోపాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. జ్వరాలు వస్తే ప్రజలు తక్షణం తమ సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. సర్పంచ్ పీతల సత్యనారాయణ, డాక్టర్ రాజేష్కుమార్, కార్యదర్శి నాగరాజు, పంచాయతీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.