యంత్రాంగం.. సన్నద్ధం

ABN , First Publish Date - 2021-01-27T05:26:50+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. బెట్టు వీడి ఎన్నికల క్రతువులో నిమగ్నమవుతున్నారు. దీంతో ఎన్నికల వేడి మొదలవుతోంది. జిల్లా ఎన్నికల అధికారి.. కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌ మంగళవారం సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు

యంత్రాంగం.. సన్నద్ధం
పంచాయతీ ఎన్నికలపై సమీక్షిస్తున్న కలెక్టర్‌

ఎన్నికల క్రతువులో నిమగ్నమవుతున్న సిబ్బంది 

అన్ని శాఖలతో కలెక్టర్‌ సమీక్ష

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. బెట్టు వీడి ఎన్నికల క్రతువులో నిమగ్నమవుతున్నారు. దీంతో ఎన్నికల వేడి మొదలవుతోంది. జిల్లా ఎన్నికల అధికారి.. కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌ మంగళవారం సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల సామగ్రి.. బ్యాలెట్‌ పత్రాలు.. బ్యాలెట్‌ బ్యాక్సులను సిద్ధం చేయడం తదితర అంశాలపై ప్రధానంగా మాట్లాడారు. దీంతో ఎన్నికలకు యంత్రాంగం అన్నీ సిద్ధం చేసుకుంటోందన్నది స్పష్టమైంది. పార్వతీపురం డివిజన్‌లో వచ్చేనెల 2న ఎన్నికల నోటిఫికేషన్‌ను కలెక్టర్‌ విడుదల చేస్తారు. 13న ఎన్నికలు నిర్వహిస్తారు. విజయనగరం డివిజన్‌లో వచ్చేనెల 4న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ డివిజన్‌లో వచ్చేనెల 17న ఓటింగ్‌ ఉంటుంది. ముందుగా సిబ్బంది కేటాయింపు - శిక్షణపై దృష్టి పెట్టారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, రూట్‌ ఆఫీసర్లు, జోనల్‌ అధికారుల నియామకంపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా తీసుకోవలసిన చర్యలపై సూచనలు ఇచ్చారు. ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు వేసుకునేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని నిర్దేశించారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్‌ సేషన్లు గుర్తించి ప్రత్యేక బందోబస్తు   ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సాధారణ పోలీస్‌ సిబ్బంది, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ప్రత్యేక పోలీస్‌ బలగాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర శాఖల అధికారులు తీసుకోవాల్సిన ఏర్పాట్లపైనా కలెక్టర్‌ సమీక్షించారు.    


Updated Date - 2021-01-27T05:26:50+05:30 IST