మాంసం అపవిత్రం కాదు, ఆహారం మాత్రమే: ఒవైసీ

ABN , First Publish Date - 2022-04-05T21:05:43+05:30 IST

నవరాత్రుల రోజుల్లో దక్షిణ ఢిల్లీలో మాసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్..

మాంసం అపవిత్రం కాదు, ఆహారం మాత్రమే: ఒవైసీ

న్యూఢిల్లీ: నవరాత్రుల రోజుల్లో దక్షిణ ఢిల్లీలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. మాంసం అపవిత్రమైనదేమీ కాదని, ఉల్లి, వెల్లుల్లి ఎలాగో మాంసం కూడా కేవలం ఆహారమేనని అన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది వంద శాతం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుందని, వద్దనుకుంటే కొనుగోలు చేయకపోతే సరిపోతుందని ఓ ట్వీట్‌లో ఒవైసీ అన్నారు.


ప్రధాని మోదీపై కూడా ఒవైసీ తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనేది పారిశ్రామికవేత్తలకే పరిమితం చేయాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు. సైద్ధాంతిక పరమైన సహచరుల కోసమే దీనిని వర్తింప చేస్తున్నారని ఆరోపించారు. ''ఆదాయం కోల్పోతే పరిహారం ఎవరిస్తారు? మాంసమేమీ అపవిత్రం కాదు. ఉల్లి, వెల్లుల్లి తరహాలో అది కూడా ఆహారం మాత్రమే. 99 శాతం కాదు, 100 శాతం ప్రజలకు మాంసం కొనాలా వద్దా అనే ఛాయెస్ ఉంటుంది. వద్దనుకుంటే కొనరు'' అని ఒవైసీ తెలిపారు.


దీనికి ముందు, నవరాత్రుల సందర్భంగా 99 శాతం ప్రజలు ఉల్లి, వెల్లుల్లి తినరంటూ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే మాంసం దుకాణాల మూసివేతకు అధికారిక ఉత్తర్వులు ఇస్తామని, మంగళవారం నుంచి దుకాణాలు తెరవడాన్ని అనుమతించమని అన్నారు. ఎస్‌డీఎంఎస్ కమిషనర్ జ్ఞానేష్ భారతికి ముఖేష్ సూర్యన్ ఈమేరకు ఒక లేఖ కూడా రాశారు. నవరాత్రి సందర్భంగా రోజువారీ దుర్గామాత పూజలు చేసేందుకు వెళ్లే వారు మాంసం దుకాణాలు దాటి వెళ్లాలన్నా, ఆ వాసన భరించాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని, భక్తుల మతపరమైన నమ్మకాలు దెబ్బతింటాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయానికి కారణాన్ని సూర్యన్ వివరిస్తూ, దుర్గామాత భక్తులు తొమ్మిది రోజులు కేవలం శాఖాహారంతోనే ఉపవాస దీక్షలు చేస్తారని, మాంసాహారం, ఆల్కహాల్, కొన్ని సుగంధ ద్రవ్యాలను ముట్టుకోరని చెప్పారు.

Updated Date - 2022-04-05T21:05:43+05:30 IST