నేరాల అదుపునకు చర్యలు: ఎస్పీ
ABN , First Publish Date - 2022-01-23T06:06:27+05:30 IST
నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటఅప్పల నాయుడు వెల్లడించారు.
రేణిగుంట, జనవరి 22: నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామనీ, ఇందుకు ప్రజలు సహకరించాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటఅప్పల నాయుడు వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక పోలీసు సబ్డివిజన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగు జాతీయ రహదారులు, నాలుగు రైల్వేమార్గాల కూడలి కేంద్రంగా ఉన్న రేణిగుంట జిల్లాకు ఓ గేట్వే లాంటిదన్నారు. ఇక్కడే విమానాశ్రయం ఉండడంతో నేరాల శాతం, ఇటు అక్రమ రవాణా పెరిగే అవకాశాలు అధికమని గుర్తుచేశారు. దీంతో నేరస్థులకు అడ్డాగా మారకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలతో అవి కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో బ్లూకోల్ట్స్ సిబ్బంది, రక్షక్ వాహనాలు అధికమార్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసు దర్యాప్తు విషయంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ స్థాయి అధికారుల నైట్బీట్ విషయమై నిఘా ఉంచుతామన్నారు. జాతీయ రహదారుల్లో పెట్రోలింగ్ మరింత మెరుగు పరుస్తామని ఆయన వివరించారు. అనంతరం గాజులమండ్యం సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. సమావేశంలో డీఎస్పీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.