నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు
ABN , First Publish Date - 2022-05-18T06:22:38+05:30 IST
నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను అరికట్టేందుకు చర్యలు తీసకుంటున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి రణధీర్రెడ్డితో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు
సిరిసిల్ల క్రైం, మే 17: నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను అరికట్టేందుకు చర్యలు తీసకుంటున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి రణధీర్రెడ్డితో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ఇందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, పటిష్ఠమైన నిఘా పెట్టి నకిలీ విత్తనాల సరఫరాను గుర్తించాలని అన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం అండగా ఉండాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ముందస్తు తనిఖీలు నిర్వహించాలన్నారు. గతేడాది నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారిపై నిఘా పెంచాలని, మళ్లీ విక్రయిస్తే పిడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి రణధీర్రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు లేని ఆర్గనైజర్ నుంచి విత్తనాలను కొని రైతులు నష్టపోవద్దన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ తీసుకోవాలన్నారు. విత్తనాలు కొనేటప్పుడు రశీదు పొందాలన్నారు. విత్తనాల ప్యాకెట్ కవర్లను పంట చేతికి వచ్చే వరకు దగ్గరే ఉంచుకోవాలని, నకిలీ అని తేలితే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, రవికుమార్, కిరణ్కుమార్, సీఐలు అనిల్కుమార్, వెంకటేశ్, ఉపేందర్, మొగిలి, బన్సీలాల్, శ్రీలత, ఎస్సైలు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.