హైదరాబాద్ యువతిని రక్షించాలంటూ ఇండియన్ కాన్సులేట్ను కోరిన విదేశాంగశాఖ
ABN , First Publish Date - 2021-02-25T14:37:59+05:30 IST
షార్జాలో చిత్రహింసలు అనుభవిస్తున్న తన కూతురిని కాపాడాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇటీవల విదేశాంగశాఖను అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విదేశాంగశాఖ స్పందించింది
హైదరాబాద్: షార్జాలో చిత్రహింసలు అనుభవిస్తున్న తన కూతురిని కాపాడాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇటీవల విదేశాంగశాఖను అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విదేశాంగశాఖ స్పందించింది. హైదరాబాద్ యువతి షార్జాలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటొందో తెలుసుకోవాలంటూ దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ను విదేశాంగశాఖ కోరింది. హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన జరీనాబేగం అనే యువతి కొద్ది నెలల క్రితం పని కోసమని షార్జాకు వెళ్లింది. తన భర్త షేక్బాబు లాక్డౌన్ సమయంలో మృత్యువాత పడటంతో ఆర్థిక ఇబ్బందులతో జరీనాబేగం సతమతమవుతూ వచ్చింది.
జరీనాబేగం ఉద్యోగ అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న హామెద్, ఆఫ్రీన్ అనే ఏజెంట్లు జరీనాను సంప్రదించారు. షార్జాలో మంచి జీతం ఉంటుందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన జరీనా.. గత ఏడాది నవంబరు 15న షార్జా చేరుకుంది. అక్కడ మరో ఏజెంటు ఆమెను ఓ అరబ్షేక్కు అప్పగించాడు. 20 మందికి పైగా సభ్యులుండే కుటుంబంలో పనికి పెట్టారు. అక్కడ ఆమెతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారు. తెల్లవారుజాముకు ముందే నిద్రలేపి పని పురమాయిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా పనిచేయాల్సిందేనని ఆర్డరేస్తున్నారు.
పనిలో ఆలస్యం జరిగితే.. కొడుతున్నారు. చిన్నతనంలో జరీనాకు కాలిన గాయాలు ఉండడంతో.. ఇప్పుడు అరబ్షేక్ కుటుంబం పెడుతున్న చిత్రహింసలకు ఆ గాయం తిరగబడింది. ఇన్ఫెక్షన్ తీవ్రమై అనారోగ్యంపాలైంది. చిక్కి శల్యమైపోయింది. అయినా చెప్పిన పనిచేయాల్సిందేనని ఆమెకు నరకం చూపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జరీనా తల్లి సుల్తానా బేగం తల్లడిల్లిపోయారు. తన కూతురిని వెనక్కి రప్పించాలంటూ కనిపించిన వారినల్లా కన్నీటి పర్యంతం వేడుకుంటున్నారు. తన కూతురి దుస్థితిని వివరిస్తూ విదేశాంగ శాఖకు లేఖ రాశారు.