ఇంటింటి సర్వేతోనే కొవిడ్కు చెక్
ABN , First Publish Date - 2022-01-21T05:40:53+05:30 IST
ఇంటింటి సర్వేతోనే కొవిడ్కు చెక్
కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ , జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఇంటింటి సర్వేను పటిష్టంగా చేపట్టి పక్కా ప్రణాళికతో కొవిడ్కు చెక్ పెడుతామని కలెక్టర్ శశాంక నివేదించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీ్షరావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్షకుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కొవిడ్ను అరికట్టెందుకు చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గ్రామాల్లో వైద్య, పంచాయతీ, మునిసిపల్ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేస్తూ కొవిడ్కు చెక్ పెడుతామని చెప్పారు. జిల్లాలోని 16 పీహెచ్సీలు, 2 సీహెచ్సీలు, ఒక యూపీహెచ్సీ, హెడ్ క్వార్టర్స్లోని ఆస్పత్రుల్లో ఓపీ పెంచుతూ కరోనా లక్షణాలున్న వారికి వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ బ్లాక్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీ్షరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచేందుకు కొవిడ్ నిర్ధారణ కాగానే తక్షణమే మందుల కిట్లను అందజేయాలన్నారు. ప్రతి రోజు ఒకసారైన పాజిటివ్ సోకిన వ్యక్తులను పలకరించి ఆరోగ్యపరిస్ధితిని తెలుసుకుని ధైర్యం చెప్పాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ డోర్ టూ డోర్ సర్వేతోనే రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని నీతి అయోగ్ ప్రతినిధులు రాష్ట్రాన్ని కొనియాడారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్షకుమార్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొవిడ్ను నియంత్రించాలని సూచించారు. గణతంత్ర వేడుకలను సాధారణంగా కొద్ది మందితో నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. మానుకోట జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీ్షరాజ్, కొవిడ్ జిల్లా నోడల్ అధికారి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.
26లోపు రెండో డోసు పూర్తి చేయాలి
జనవరి 26లోపు జిల్లాలో కరోనా టీకా రెండో డోసు వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ నుంచి గురువారం టెలికాన్ఫరెన్స్లో జిల్లా వైద్యశాఖాధికారి, ఇతర జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికి బూస్టర్ డోసును రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. అంతే కాకుండా జిల్లాలో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికి కరోనా టెస్టులు విధిగా నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో అవసరం వేరకు కొవిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకుని, పాజిటివ్ నిర్ధారణ వ్యక్తులకు సకాలంలో అందజేయాలని పేర్కొన్నారు. కొవిడ్ నిర్ధారణ చేసే ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నిషియన్లు మిగతా ఆరోగ్య సిబ్బంది విధిగా పీపీఈ కిట్లను ధరించడంతో పాటు ఫేస్ షీల్డ్లను ఉపయోగించాలన్నారు. ప్రజలంతా మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.