బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , First Publish Date - 2021-10-12T05:43:13+05:30 IST
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ శశాంక అన్నారు. మహబూబాబాద్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న బాలికలను సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బేటి పడావో.. బేటీబచావో కార్యక్రమాన్ని విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. బాలల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని అభినందించారు. బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి మాట్లాడుతూ జిల్లాలో బాలికల అక్షరాస్యత 88 శాతం మాత్రమే ఉందని, సెకండరీ విద్యలో 52 శాతం నమోదు అవుతున్నారని, ఉన్నత విద్యలో కేవలం 33 శాతం మాత్రమే చేరుకుంటున్నారని చెప్పారు. మానుకోట జిల్లా గిరిజన ప్రాంతమని, బాలికల పట్ల వివిక్ష లేకుండా ఎదగనివ్వాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాలికల విద్యపట్ల కృషి చేయాలని కోరారు. అనంతరం బాలికల విద్యాభివృద్ధికి ఆడపిల్లను బతకనిద్ధాం..చదవనిద్ధాం...ఎదగనిద్ధాం.. అంటూ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ చేత ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్, కొమురయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి స్వర్ణలత లెనినా, సీడీపీవో లిల్లి డెబోరా పాల్గొన్నారు.
సమన్వయంతో పనులు చేపట్టాలి..
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ శశాంక అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, మెడికల్ కళాశాల పనులు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై సంబంధితాధికారులతో సమీక్షించారు. మెడికల్ కళాశాల మ్యాప్ను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ పనులను కూడా వేగవంతం చేయాలని, అవసరం లేని నిర్మాణాలు తొలగించాలన్నారు. విద్యుత్, తాగునీరు కనెక్షన్ల కోసం సంబంధిత అధికారులకు లేఖలు రాయాలన్నారు. అదనపు కలెక్టర్ కొమురయ్య, అధికారులు తానేశ్వర్, రాజేందర్, నర్సింహామూర్తి, రంజిత్, భాస్కర్ పాల్గొన్నారు.
గ్రీవెన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్, కొమురయ్య, జడ్పీసీఈవో రమాదేవి, డీఆర్డీఏ సన్యాసయ్య పాల్గొన్నారు.