నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-09-17T06:05:46+05:30 IST
నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
కలెక్టర్ శశాంక
బయ్యారం, సెప్టెంబరు 16 : నిర్ధేశిత గడువులోపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక వైద్య సిబ్బందిని ఆదేశించారు. బయ్యారం పీహెచ్సీ పరిధిలోని జగ్గుతండా సబ్సెంటర్లో స్పెషల్ డ్రైవ్ మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 21 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు 173 సబ్సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ వివరాలను సేకరించేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్, ఎంపీడీవో, వైద్యాధికారులకు సూచించారు. ప్రతి మునిసిపాలిటీ, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో 5 లక్షల 43 వేల మంది అర్హులైన వారిని గుర్తించగా రెండు లక్షల 40 వేల మందికి మెదటి డోస్ ఇచ్చారని, మరో మూడు లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. రోజుకు పీహెచ్సీ కేంద్రాలలో 200 నుంచి 300 వరకు, సబ్ సెంటర్లలో 100 నుంచి 150 వరకు వ్యాక్సినేషన్ వేయాలన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో అవసరమగు సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులందరికి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత డిక్లేర్ చేస్తూ ఇంటింటికి స్టిక్కరింగ్ చేయాలని, అప్పుడు మాత్రమే పూర్తి దశలో వ్యాక్సినేషన్ జరిగినట్లు పరిగణిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీష్రాజా, ప్రత్యేకధికారి రామకృష్ణరావు, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో చలపతిరావు, వైద్యాధికారి రాజ్కుమార్ పాల్గొన్నారు.