నగరంలో 60 స్మశాన వాటికల అభివృద్ధి- మేయర్ రామ్మోహన్
ABN , First Publish Date - 2020-07-14T01:22:35+05:30 IST
జంటనగరాల్లో 60 స్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసి చర్యలు తీసుకుంటున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
హైదరాబాద్: జంటనగరాల్లో 60 స్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసి చర్యలు తీసుకుంటున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్, శాసన సభ్యులు అరికెపూడి గాంధీతో కలిసి మల్కంచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు వెనకవైపు 100 అడుగుల వెడల్పుతో విస్తరించనున్న రోడ్డు ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ప్రతిపాదితరోడ్డు విస్తరణకు హౌసింగ్బోర్డు భూమికి మధ్య ఉన్న స్మశాన వాటికను మేయర్ పరిశీలించారు. ఈ స్మశాన వాటికకు అందుబాటులో ఉన్న జీహెచ్ఎంసి భూమిని కొంత కలపడంతో పాటు హౌసింగ్బోర్డు స్థలానికి హద్దులు నిర్ధారించి ప్రహారీ గోడను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
స్మశాన వాటికకు విద్యుత్ లైటింగ్, తాగునీరు సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. అదే విధంగా సమీపంలో ఉన్నకాలనీ వాసుల సౌకర్యార్ధం రెండు అంతర్గత రోడ్లను, ఒక నాలాను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్ అవసరాల నిమిత్తం 100ఫీట్ల రోడ్లు నిర్మాణానికి సహకరించాలని బస్తీవాసులను కోరారు. ఈ అంశంలో బస్తీవాసులు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.