వ్యాక్సిన్తోనే కొవిడ్ నుంచి రక్షణ
ABN , First Publish Date - 2021-05-13T06:13:17+05:30 IST
ప్రజలు కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని నగర మేయర్ కావటి శివనాగ మనోహరనాయుడు తెలిపారు.
నగర మేయర్ కావటి మనోహర నాయుడు
గుంటూరు(కార్పొరేషన్), మే 12: ప్రజలు కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని నగర మేయర్ కావటి శివనాగ మనోహరనాయుడు తెలిపారు. బుధవారం నగరంలోని వ్యాక్సిన్ కేంద్రాలైన రామనామక్షేత్రం, ఎస్కేవీఎం హైస్కూల్, లాల్జాన్బాషా ఫంక్షన్ హాల్, యాదవ బజార్లోని శ్రీకృష్ణ కల్యాణ మండపాలను ఎమ్మెల్యే మద్దాళిగిరితో కలిసి పరిశీలించారు. తొలుతగా వ్యాక్సినేషన్ కేంద్రాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారు టోకెన్ విధానం ప్రకారం అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని 10 ప్రాంతాల్లో శాశ్వత వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశామని తొలి డోసు వేసుకుని 6 నెలలు గడిచిన వారు మాత్రమే రెండో డోసు వేసుకునేందుకు అర్హులన్నారు. రెండవ విడత వ్యాక్సిన్ కొరకు నేరుగా సెల్కి మెసేజ్ వస్తుందని, వారు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్కు రావాలన్నారు. వ్యాక్సిన్ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతోందని తెలిపారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ వ్యాక్సిన్ రెండో డోసు ఈ నెల 30 వరకు వేయడం జరుగుతోందని తెలిపారు. కొవిడ్ బారిన పడినవారు కనీసం 42 రోజులు తరువాత మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ, అందుగుల సంతోష్ కుమార్, అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, సజీల షేక్, ఖాజా మొహిద్దీన్, పోలవరపు జ్యోతి, ధనలక్ష్మి, మీరావలి షేక్, యల్లావుల అశోక్, వైసీపీ నాయకులు షౌకత్, ఇర్రి సాయి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.