నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం
ABN , First Publish Date - 2022-01-29T05:31:25+05:30 IST
నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో పనిచేయాలని, నగర కమిషనర్ నిశాంతకుమార్ సూచించారు.
కమిషనర్ నిశాంతకుమార్
గుంటూరు(కార్పొరేషన్), జనవరి28: నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో పనిచేయాలని, నగర కమిషనర్ నిశాంతకుమార్ సూచించారు. శుక్రవారం తన చాంబర్లో విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో తొలుత విభాగాల వారీగా నిర్వహించే విధివిధానాలపై అడిగి తెలుసుకున్నారు. యూజీడీ పనుల వివరాలు అడిగి తెలుసుకొని, రోడ్లపైన గుంతలు లేకుండా పూడ్చాలని ఆదేశించారు. ఆస్తిపన్ను మొండి బకాయులపై దృష్టి పెట్టాలన్నారు. సచివాలయాల వారీగా అనధికార కట్టడాలు, రోడ్లు, డ్రైన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని, క్షేత్ర స్థాయిలో సమస్యలను తన దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నిరంజన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఈ దాసరి శ్రీనివాస్, ఇన్చార్జ్ సీపీ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. మేయర్ మనోహర్ నాయుడును నిశాంత్ కుమార్ కలిశారు. ఇరువురు సుమారు 45 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. గుంటూరు నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని ఇరువురు నిర్ణయించుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ సత్వరం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ను ఆయన చాంబర్లో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మర్యాదపూర్వకంగా కలిశారు.