మాయావతి పోటీ చేయడం లేదు: బీఎస్‌పీ

ABN , First Publish Date - 2022-01-11T19:40:28+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి..

మాయావతి పోటీ చేయడం లేదు: బీఎస్‌పీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి పోటీ చేయడం లేదు. ఆ పార్టీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. తాను సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ తమ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో మాయవతి, నేను పోటీ చేయడం లేదు. సమాజ్‌వాదీ పార్టీకి 400 మంది అభ్యర్థులు లేకపోతే వాళ్లు (ప్రధాన పార్టీలు) ఎలా 400 సీట్లు గెలుస్తారు? సమాజ్‌వాదీ పార్టీ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి రాబోవడం లేదు. యూపీలో ప్రభుత్వాన్ని బీఎస్‌పీ ఏర్పాటు చేస్తుంది'' అని మిశ్రా అన్నారు.


దీనికి ముందు కూడా, మాయావతి కావాల్సినంత చురుకుగా ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ప్రధాని మోదీ సహా ఇతర పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటికీ మాయావతి ఇంకా ప్రచారానికే సిద్ధం కాలేదంటూ వచ్చిన విమర్శలపై బీఎస్‌పీ ఈ వ్యాఖ్యలు చేసింది. మాయావతి కేవలం ట్విట్టర్‌లోనే చురుకుగా ఉన్నారని, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పత్రికా ప్రకటనలకు, ట్వీట్లకు పరిమితమయ్యారని కొద్దికాలంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.


కాగా, మాయవతి 66వ పుట్టినరోజైన జనవరి 15న బీఎస్‌పీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారని తెలుస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున పార్టీ కార్యకర్తలు తన పుట్టినరోజు వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని మాయావతి ఇటీవల కోరారు.యూపీలో ఏడు విడతల పోలింగ్ ఫిబ్రవరి 10తో ప్రారంభమై మార్చి 7వ తేదీతో పూర్తవుతాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

Updated Date - 2022-01-11T19:40:28+05:30 IST