30 ఏళ్ల తర్వాత .. ఆ రికార్డు మయాంక్ సొంతం!

ABN , First Publish Date - 2020-02-21T17:16:58+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబాటుకు గురైంది. 122 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్సులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పేరిట ....

30 ఏళ్ల తర్వాత .. ఆ రికార్డు మయాంక్ సొంతం!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబాటుకు గురైంది. 122 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్సులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. న్యూజిలాండ్ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో తొలి సెషన్ మొత్తం ఆడిన భారత జట్టు ఓపెనర్‌గా మయాంక్ రికార్డులకెక్కాడు. తద్వారా 30 ఏళ్ల నాటి రికార్డును చెరిగిపోయింది. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ ప్రభాకర్ పేరిట ఉంది.  


1990నాటి నేపియర్ టెస్టులో మనోజ్ ప్రభాకర్ ఓపెనర్‌గా దిగి తొలి సెషన్ అంతా క్రీజులో ఉన్నాడు. 268 బంతులను ఎదుర్కొని 95 పరుగులు చేశాడు.  ఆ తర్వాత ఇప్పటికి ఆ రికార్డును మయాంక్ బ్రేక్ చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఓపెనర్‌ పృథ్వీ షా వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన చటేశ్వర పుజారా(11), విరాట్ కోహ్లీ(2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను మయాంక్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తొలి సెషన్ పూర్తయ్యే నాటికి 29 పరుగులు చేశాడు. విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ మరో ఐదు పరుగులు జోడించి పెవిలియన్ చేరాడు. మయాంక్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్‌ గడ్డపై సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ కొద్దిసేపటికే హనుమ విహారీ రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 55 ఓవర్లు పూర్తయ్యే నాటికి టీమిండియా 122 పరుగులు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ నిలిచిపోయింది. 

Updated Date - 2020-02-21T17:16:58+05:30 IST