శ్రావణమాసమే.. నీకు శాపమైందా.!

ABN , First Publish Date - 2021-08-11T21:20:29+05:30 IST

ఎలమంచిలి(విశాఖపట్నం): "శ్రావణ మాసంలో ఉద్యోగం వచ్చింది.. శ్రావణ మాసంలోనే వివాహమైంది.. ఇన్ని ఆనందాలు మిగిల్చిన ఈ శ్రావణ మాసంలోనే దేవుడు నిన్ను మాకు దూరం చేశాడే.."

శ్రావణమాసమే.. నీకు శాపమైందా.!

కన్నీటి పర్యంతమవుతున్న ఆర్మీ ఉద్యోగి కుటుంబం


ఎలమంచిలి(విశాఖపట్నం): "శ్రావణ మాసంలో ఉద్యోగం వచ్చింది.. శ్రావణ మాసంలోనే వివాహమైంది.. ఇన్ని ఆనందాలు మిగిల్చిన ఈ శ్రావణ మాసంలోనే దేవుడు నిన్ను మాకు దూరం చేశాడే.." అంటూ రైలు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి దంట్ల శ్రీరాములు తల్లి చెంచులక్ష్మి బోరున విలపించింది. మంగళవారం శ్రీరాములు కుటుంబాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి పలకరించగా.. ఆమెతో పాటు భార్య కల్యాణి అతని జ్ఞాపకాలను పంచుకున్నారు.


తమ కుమారుడు చదువు, ఆటల్లో ముందుండేవాడని.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఆప్యాయంగా ఉండేవాడని గుర్తు చేశారు. వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకొందామని వస్తూ.. తన భర్త దూరమయ్యాడని శ్రీరాములు భార్య కల్యాణి కంటతడి పెట్టింది. ఇంటర్మీడియట్‌లో ఉండగా శ్రీరామ్‌, తాను ప్రేమించుకున్నామని, అందరి ఆమోదంతో పెళ్లి చేసుకున్నామని చెప్పింది. మిలిటరీలో చేరినప్పటికీ బాక్సింగ్‌ వంటి క్రీడా పోటీల్లో ఎన్నో పతకాలు సాధించేవాడని కల్యాణి తెలిపింది. ఏడాదిన్నర కుమార్తెతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని, శ్రీరాములు దూరం కావడంతో ఇప్పుడు ఆధారం కోల్పోయామని కల్యాణి విలపిస్తూ వాపోయింది. కాగా, శ్రీరాములు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2021-08-11T21:20:29+05:30 IST