మా పిల్లలను బతికించరూ!
ABN , First Publish Date - 2022-05-24T04:56:42+05:30 IST
రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన చవాన్ వినోద్, సావిత్రీబాయి కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
సంగారెడ్డి రూరల్, మే 23: రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన చవాన్ వినోద్, సావిత్రీబాయి కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జహీరాబాద్ మండలం అనేగుంట గ్రామం లచ్చన్న తండాకు చెందిన నవీన్, సావిత్రి దంపతులకు నాలుగేళ్ల సవేచ అమ్మాయి, పది నెలల బాబు ఆనంద్ ఉన్నారు. పెద్దకూతురు సవేచకు వింత వ్యాధి సోకడంతో మానసికంగా ఎదగడం లేదు. వయసు నాలుగేళ్లయినా ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యం చేయించారు. పాప వైద్యం చేయిస్తున్న సమయంలోనే చిన్న కుమారుడు ఆనంద్కు అదే వ్యాధి సోకడంతో ఇద్దరికి వైద్యం చేయించేందుకు ఉన్న ఒక ఎకరం పొలం (భూమి) అమ్మి సంగారెడ్డి, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రులో వైద్యం చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియని స్థితిలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్కు వచ్చి అధికారులను కలిసి తమ పిల్లలను బతికించండి అంటూ వేడుకోవడం చూసి అక్కడ ఉన్నవారు చలించిపోయారు. ఆర్థికసాయం చేయలేమని పింఛన్ వచ్చే ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పి పంపించారు.