కరోనా ప్రాబల్య ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగింపు?
ABN , First Publish Date - 2020-04-04T18:00:39+05:30 IST
కరోనా లాక్డౌన్ పొడిగింపుపై మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే సంచలన వ్యాఖ్యలు చేశారు....
మహారాష్ట్ర వైద్యశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై : కరోనా లాక్డౌన్ పొడిగింపుపై మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్డౌన్ ఏప్రిల్ 14వతేదీన ముగియనున్న నేపథ్యంలో కరోనా అధికంగా ప్రబలుతున్న నగరాల్లో లాక్డౌన్ ను పొడిగిస్తామని వైద్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతోపాటు ఒక్క ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక్కరోజే 53 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కరోనా వల్ల ఆరుగురు మరణించగా, వీరిలో ముంబై నగరానికి చెందిన వారే నలుగురున్నారు. ధారావీకి మురికివాడకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రాబల్య నగరాల్లో లాక్డౌన్ గడవును పొడిగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి రాజేష్ తోపే చెప్పారు. కరోనా కేసులు ప్రబలిన నగరాలైన ముంబైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని వారాల పాటు లాక్డౌన్ ను పొడిగించే అవకాశముందని మంత్రి రాజేష్ వివరించారు. మహారాష్ట్రలో 490 కేసులు బయటపడగా, ఇందులో 278 ముంబై నగరంలోనివే కావడం విశేషం.