కేఎల్ రాహుల్కు మ్యాక్స్వెల్ క్షమాపణ
ABN , First Publish Date - 2020-11-29T00:08:23+05:30 IST
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్ష్వెల్ 13 మ్యాచుల్లో
సిడ్నీ: ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్ష్వెల్ 13 మ్యాచుల్లో 108 పరుగులు మాత్రమే చేసి విమర్శల పాలయ్యాడు. రూ. 10.75 కోట్లు పెట్టి తనను సొంతం చేసుకున్న పంజాబ్ యాజమాన్యానికి తీవ్ర నిరాశ కలిగించాడు. ఐపీఎల్లో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్వెల్.. భారత్తో నిన్న స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో మూడు సిక్సర్లు బాదాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఇందులో 5 బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మ్యాక్స్వెల్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. అనంతరం మ్యాక్సీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేఎల్ రాహుల్కు క్షమాపణలు చెప్పాడు.
మ్యాక్సీ ఆటను అభిమానులు ప్రస్తావిస్తూ ఐపీఎల్లో ఇలాంటి ప్రదర్శన ఒక్క మ్యాచ్లో చేసి ఉన్నా పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. మరోవైపు, ఐపీఎల్లో పంజాబ్కే ప్రాతినిధ్యం వహించి న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా విండీస్తో జరిగిన తొలి టీ20లో 24 బంతుల్లో 48 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాక్స్వెల్, నీషమ్ ఆటతీరుపై ఓ అభిమాని స్పందిస్తూ.. సొంతదేశాలకు ఆడేటప్పుడు ఎలాంటి విలువైన ఇన్నింగ్స్లు ఆడారో కేఎల్ రాహుల్ చూస్తున్నాడంటూ కామెంట్ చేశాడు.
ఆ కామెంట్కు నీషమ్ బదులిస్తూ.. నిజంగానే బాగా ఆడామని సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాక్స్వెల్ కూడా స్పందిస్తూ, తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్కు క్షమాపణలు చెప్పానని పేర్కొన్నాడు.