ఔషధాలపై 3,000 శాతం అధికంగా ఎంఆర్పీ!
ABN , First Publish Date - 2021-01-23T06:13:56+05:30 IST
ఔషధలపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) అసాధారణంగా 3,000 నుంచి 4,000 శాతం వరకు అధికంగా ముద్రిస్తున్నారని నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
ట్రేడ్ మార్జిన్ పరిమితి విధిస్తే ధర 80ు తగ్గుతుంది
ప్రస్తుతానికి కేన్సర్ ఔషధాలపై అమలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఔషధలపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) అసాధారణంగా 3,000 నుంచి 4,000 శాతం వరకు అధికంగా ముద్రిస్తున్నారని నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపక ప్రెసిడెంట్ పీఆర్ సోమానీ అన్నారు. ఔషధాలపై ఎంఆర్పీ ముద్రణపై ఎటువంటి గరిష్ఠ పరిమితి లేకపోవటంతో ఔషధ తయారీదారులు అసాధారణ ధరలను ఔషధాలపై ముద్రిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఎఫ్టీసీసీఐ, ఎఫ్ఏపీసీసీ నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. ఎంఆర్పీ ధరల వద్ద ఔషధాలను కొనుగోలు చేస్తున్న ప్రజలు ఎంఆర్పీపై ప్రభుత్వ నియంత్రణ ఉందని భావిస్తున్నారన్నారు. ఎంఆర్పీ ముద్రణపై నియంత్రణలు విధిస్తే ముద్రించే ధరలు 80-90 శాతం వరకు తగ్గుతాయని పేర్కొన్నారు. తయారీ వ్యయంపై గరిష్ఠంగా 30 శాతం ట్రేడ్ మార్జిన్, పన్నులు కలిపి ఎంఆర్పీని నిర్ణయించాలని పేర్కొన్నారు.
కాగా సోమానీ వినతి మేరకు కేన్సర్ ఔషధాలపై ఫార్మా విభాగం 30 శాతం ట్రేడ్ మార్జిన్ను విధించింది. ఇది 2019 మార్చిలో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కేన్సర్ ఔషధాలపై ఉండే ఎంఆర్పీ 90 శాతం వరకూ తగ్గింది. అన్ని ఔషధాలపై 30 శాతం ట్రేడ్ మార్జిన్ను అమలు చేయడానికి కృషి చేస్తున్నామని, ఇది అమల్లోకి వస్తే. అన్ని ఔషధాల గరిష్ఠ చిల్లర ధరలు 90 శాతం వరకూ తగ్గుతాయని చెప్పారు. వాస్తవానికి బ్రాండెడ్, జెనరిక్ ఔషధాల మధ్య తేడా లేదన్నారు.