మట్టిని మింగేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-10-20T06:01:32+05:30 IST

నిన్న మొన్నటి వరకూ చెరువులు, కొండలలో మట్టి అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీ నేతల పాత్రపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి.

మట్టిని మింగేస్తున్నారు..!
చెరువు మట్టిని టిప్పర్‌లోకి లోడ్‌ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

చెరువులో అక్రమ తవ్వకాలు

సమీప రియల్‌ ఎస్టెట్‌ ప్లాట్లకు తరలింపు

కొండనూ కొల్లగొడుతున్న అక్రమార్కులు

కన్నెత్తి చూడని యంత్రాంగం

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

మార్కాపురం, అక్టోబరు 19 : నిన్న మొన్నటి వరకూ చెరువులు, కొండలలో మట్టి అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీ నేతల పాత్రపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ఆ విషయంపై పలుమార్లు పత్రికలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ నిఘా విభాగాలు సైతం ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. దీంతో ఇప్పుడు ఆ వైపు అధికార పార్టీ నేతలు కన్నెత్తి చూడటం లేదు. నాడు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో జరిగిన మట్టి అక్రమ రవాణాకు సహకరించిన నీటిపారుదల, మైనింగ్‌ అధికారులకు అక్రమార్కులు ముడుపులు అందిస్తుండడంతో ఇక్కడ ఏం జరుగుతున్నా మిన్నకుంటున్నారు. దీంతో అక్రమార్కులు చెరువులు, కొండల్లో మట్టిని మింగేస్తున్నారు.

అర్ధరాత్రి తరలింపు

చెరువులు, కొండల్లో రాత్రి వేళలో చెరువులు, కొండలలో భారీగా ఎక్స్‌కవేటర్లలతో మట్టిని తవ్వుతున్నారు. సాయంత్రం చీకటి పడగానే ఎక్స్‌కవేటర్లతో తవ్వే పనులు సాగిస్తున్నారు. అక్రమార్కులు ఎక్స్‌కవేటర్‌ యజమానులతో ముందుగా ఒప్పందం చేసుకొని  ఎంత మట్టి అవసరమౌతుందో? అందుకు ఎన్ని ట్రిప్పులు తోలాల్సి ఉంటుందో..? ఎన్ని చోట్లకు దానిని తరలించాలో అన్నది ముందుగా  నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రాత్రి 10 గంటల తర్వాత టిప్పర్లతో రియల్టర్లు చెప్పిన స్థలాలకు మట్టిని తరలిస్తున్నారు. 

ఆదాయ వనరుగా వేములకోట చెరువు, నాగులవరం కొండ

మట్టి దొంగలకు మార్కాపురం మండలంలోని వేములకోట చెరువు, నాదర్‌సాబ్‌కుంట, నాగులవరం కొండలు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. గత మూడు రోజులుగా అక్రమార్కులు వేములకోట చెరువులో యథేచ్ఛగా అర్ధరాత్రి వేళ  మట్టిని తవ్వి తరలిస్తూ ఆర్జిస్తున్నారు. 

కన్నెత్తి చూడని యంత్రాంగం

ఇంత జరుగుతున్నా మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. చెరువుల్లో మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన నీటిపారుదల శాఖాధికారాలు, కొండల తవ్వకాలను అరికట్టాల్సిన మైనింగ్‌ అధికారులు నియంత్రించడంలేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో విమర్శలు విన్పిస్తున్నాయి. సంబంధిత అధికారుల చేతులు తడుపుతుండడంతోనే మట్టిదొంగల అక్రమ రవాణాకు అధికారులు అండగా ఉంటున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 




Updated Date - 2021-10-20T06:01:32+05:30 IST