శ్రీకృష్ణ జన్మభూమిలో మసీదు తొలగించాలన్న పిటిషన్ తిరస్కృతి
ABN , First Publish Date - 2020-10-01T01:18:09+05:30 IST
శ్రీకృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్థానిక సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. కట్ర కేశవ్ దేవ్
మధుర : శ్రీకృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్థానిక సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. కట్ర కేశవ్ దేవ్ దేవాలయానికి చెందిన 13 ఎకరాల స్థలంలో శ్రీకృష్ణ జన్మభూమి ఉందని, దీనిలో మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు.
భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరపున రంజన అగ్నిహోత్రి, మరొక ఏడుగురు ఈ పిటిషన్ను మధురలోని సీనియర్ సివిల్ జడ్జి ఛాయా శర్మ వద్ద దాఖలు చేశారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహి ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూమి ఒప్పందాన్ని ఆమోదిస్తూ 1968లో మధుర కోర్టు ఇచ్చిన రూలింగ్ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.
ఈ పిటిషన్ను విచారణకు అనుమతించకపోవడానికి కారణం ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 ప్రకారం నిషేధం ఉండటమేనని కోర్టు చెప్పింది.
ఇదిలావుండగా, ఈ పిటిషన్ను అఖిల భారతీయ తీర్థ్ పురోహిత్ మహాసభ అధ్యక్షుడు మహేశ్ పాఠక్ వ్యతిరేకించారు. మధురలో ప్రశాంతతను దెబ్బతీయడం కోసం కొందరు బయటివారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.