కుప్పలు తెప్పలుగా!

ABN , First Publish Date - 2021-12-01T05:02:15+05:30 IST

ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు

కుప్పలు తెప్పలుగా!

  • ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తులు 
  • రంగారెడ్డిలో 19,059, వికారాబాద్‌లో 18,237, మేడ్చల్‌లో 8,488
  • ముగిసిన దరఖాస్తుల స్వీకరణ 
  • జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటన


ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది. ఓటు హక్కు పొందేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారితోపాటు మార్పులు, చేర్పులు ఇతర అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి 2022 జనవరి 5వ తేదీ ఓటరు తుది జాబితాను ప్రచురిస్తారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా కొత్త ఓటర్ల నమోదు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. అర్హుల నుంచి పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అధికారులు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి నవంబర్‌ ఒకటో తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసిన సంగతి విధితమే. ఈ ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే ముసాయిదా ప్రకటించిన రోజు నుంచి నెలరోజులపాటు అంటే నవంబర్‌ 30వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. ఓటర్ల జాబితాలో చిరునామా, పేర్లలో పొరపాట్లతోపాటు ఇతర మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. వీటితోపాటు ఓటు హక్కు పొందేందుకు అర్హత లభించిన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2022 జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారితోపాటు మార్పులు, చేర్పులు ఇతర అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి 2022 జనవరి 5వ తేదీ ఓటరు తుది జాబితాను ప్రచురిస్తారు. నెలరోజుల పాటు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణలో ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డిజిల్లాలో 1,90,59 మంది ఓటు హక్కు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 8,488, వికారాబాద్‌ జిల్లాలో 18,237 మంది దరఖాస్తు చేసుకున్నారు.  అత్యధికంగా ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3,047 దరఖాస్తులు రాగా అతి తక్కువగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి 711 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులు పరిశీలన జరుపుతారు. ఇప్పటికే కొందరు దరఖాస్తులపై పరిశీలన మొదలైంది.  ఇదిలా ఉంటే ఇటీవల విడుదలచేసిన ముసాయిదా జాబితా ప్రకారం గత పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే  రంగారెడ్డిజిల్లాలో 1,65,708  మంది ఓటర్లు పెరిగారు. జిల్లాలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,61,798 మంది ఓటర్లు ఉండగా తరువాత  ఎల్‌బీనగర్‌లో 554121 మంది ఓటర్లు నమోదయ్యారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లాలో కొత్తగా ఓటు హక్కు కోసం 8,488 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మేడ్చల్‌ రెవెన్యూ డివిజన్‌లో 2,602 మంది, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్‌లో 2,204 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఈనెల 6,7,27,28వ తేదీల్లో నిర్వహించిన ఓటర్‌ నమోదు ప్రత్యేక క్యాంపుల ద్వారా 3,682 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. 18 సంత్సరాలు నిండిన వారితోపాటు జనవరి 2022 వరకు 18 సంవత్సరాలు నిండుతున్న వారు 723 మంది ప్రత్యేకంగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. కొత్త జాబితా విడుదలయ్యే వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.


రంగారెడ్డిలో నియోజకవర్గాల వారీగా ఓటర్లు, దరఖాస్తులు

నియోజకవర్గం ప్రస్తుత ఓటర్లు కొత్త దరఖాస్తులు

ఇబ్రహీంపట్నం 2,85,342 2,082

ఎల్‌బీనగర్‌ 5,54,121 3,047

మహేశ్వరం 4,85,900 2,889

రాజేంద్రనగర్‌ 4,98,825 3,413

శేరిలింగంపల్లి 6,61,798 3,914

చేవెళ్ల 2,38,057 711

కల్వకుర్తి 2,19,102 1,132

షాద్‌నగర్‌ 2,05,887 1,871

మొత్తం 3,14,9032 19,059

వికారాబాద్‌ జిల్లాలో..

పరిగి -- 6,672

వికారాబాద్‌ -- 5,067

తాండూరు -- 3,129

కొడంగల్‌ -- 3,369

Updated Date - 2021-12-01T05:02:15+05:30 IST