కరోనా టీకా కన్నా మాస్కే బెటర్.. అమెరికా అధికారి కీలక వ్యాఖ్య

ABN , First Publish Date - 2020-09-17T15:55:33+05:30 IST

ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో మాస్కు అత్యంత ప్రభావశీలమైనవని అమెరికాలోని సెంటర్ డీసీజ్ కండ్రోల్ అండ్ ప్రెవెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ వ్యాఖ్యానించారు. అమెరికా సెనెట్ సబ్‌కమిటీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

కరోనా టీకా కన్నా మాస్కే బెటర్.. అమెరికా అధికారి కీలక వ్యాఖ్య

వాషింగ్టన్: ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో మాస్కు అత్యంత ప్రభావశీలమైనవని అమెరికాలోని సెంటర్ డీసీజ్ కండ్రోల్ అండ్ ప్రెవెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ వ్యాఖ్యానించారు. అమెరికా సెనెట్ సబ్‌కమిటీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కరోనాను నుంచి కాపాడటంలో టీకా కన్నా మాస్క్‌యే మరింత ప్రభావశీలమైనది ఆయన సెనెట్ సబ్‌కమిటీకి స్పష్టం చేశారు.


‘మన వద్ద ఉన్న శాస్త్రీయమైన ఆధారాలు ఇదే నిరూపిస్తున్నాయి. కరోనా నుంచి మనల్ని కాపాడే అత్యంత ప్రభావశీలమైన సాధనం మాస్కు! ఆ మాటకొస్తే.. టీకా కన్నా కూడా మాస్కే మనల్ని గ్యారెంటీగా కరోనా నుంచి కాపాడుతుందని చెప్పొచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీకా అందుబాటులోకి వచ్చినా కూడా మాస్కులు ధరించడం కొనసాగించాలని రెడ్ ఫీల్డ్ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు వినియోగిస్తే కరోనా మహమ్మారికి తొందరగా అదుపులోకి తేవచ్చని చెప్పారు. 


కరోనా టీకా ఈ ఏడాది చివరికి గానీ లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలోగానీ అందుబాటులోకి వస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి ప్రజల్ని టీకా ఎంతమేరకు రక్షింస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం నిపుణుల వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు.


తొలి దశలో లభ్యమయ్యే టీకాలు ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో రక్షణ కల్పించలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 75 శాతం మందికి రక్షణ లభిస్తే మనల్ని మనం అదృష్టవంతులుగా భావించాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. టీకా కనీసం 50 శాతం రక్షణ కల్పిస్తుందని రుజువైతే విధానపరమైన అనుమతులు జారీ చేస్తామని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మాస్కుల ప్రాముఖ్యాన్ని విశదీకరించారు.


Updated Date - 2020-09-17T15:55:33+05:30 IST