స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2021-04-21T06:07:03+05:30 IST
స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి
ఫ ప్రతి ఒక్కరూ విధిగా
మాస్క్లు ధరించాలి
ఫనున్న మ్యాంగో మార్కెట్లో ప్రతిజ్ఞ చేయించిన ఏసీపీ షాను
విజయవాడ రూరల్, ఏప్రిల్ 20 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా ఉండాలంటే స్వీయ రక్షణ చర్యలే ప్రధానమని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నార్త్జోన్ ఏసీపీ షేక్ షాను చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించడంతోపాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. ఆసియాలోనే పెద్దదైన నున్న మ్యాంగో మార్కెట్లో పోలీసు, నున్న మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులు, కూలీలకు కరోనాపై అవగాహన, మాస్క్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ షాను మాట్లాడుతూ, కరోనా రెండో దశ ఉధృతంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజూ వేలాది మంది కరోనా బారినపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు చేపడితే తప్ప మహమ్మారి బారిన పడకుండా ఉంటారని తెలిపారు. నున్న మ్యాంగో మార్కెట్లకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుండగా, ఇతర అనేక జిల్లాల నుంచి రైతులు, కూలీలు వచ్చారని, ఈ నేపథ్యంలో వ్యక్తిగత దూరం పాటించాలన్నారు. నిత్యం మాస్క్ ధరించాలని, ఆ విషయంలో మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. కూలీలు, రైతులు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏసీపీ షాను సూచించారు. అనంతరం ఏసీపీ రైతులు, వ్యాపారులు, కూలీలతో కరోనా నుంచి రక్షణ పొందేందుకు బాధ్యతగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ దరియా హుస్సేన్, ప్రధాన కార్యదర్శి ఇగుటూరి శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లాది శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సయ్యద్ లాల్ అహ్మద్, కోశాధికారి షేక్ సైఫుద్దీన్, నున్న రూరల్ సీఐ హనీష్బాబు, ఎస్సై హైమవతి తదితరులు పాల్గొన్నారు.