Dowry harassment: కట్నం ఇవ్వలేదని దారుణం.. మొబైల్ ఛార్జర్తో భార్యను ఉరేసి చంపిన భర్త..
ABN , First Publish Date - 2022-08-24T22:27:26+05:30 IST
కట్నం కోసం ఓ భర్త పశువులా మారాడు. తను అడిగినంత కట్నం ఇవ్వలేదని కట్టుకున్న భార్యను వేధింపులకు గురి చేశాడు.
కట్నం కోసం ఓ భర్త పశువులా మారాడు. తను అడిగినంత కట్నం ఇవ్వలేదని కట్టుకున్న భార్యను వేధింపులకు గురి చేశాడు. ఫలితంగా ఆ మహిళ మరణించింది. బీహార్ (Bihar)లోని పాట్నాలో దుల్హిన్ బజార్లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు వివాహిత భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాట్నా ఎయిమ్స్కు తరలించారు. వరకట్నం కోసం తన సోదరిని ఆమె భర్త, అత్తమామలు హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి సోదరుడు ఆరోపించాడు.
ఇది కూడా చదవండి..
ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల ఓ నిండు కుటుంబం బలి.. పరువు పోతోందని ఆ భర్త ఎంత దారుణానికి తెగించాడంటే..
పాలిగంజ్కు చెందిన పర్వానా పర్వీన్ (21) అనే యువతి 2019లో దుల్హన్ బజార్కు చెందిన అన్వర్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు జన్మించారు. గత రెండేళ్లుగా పర్వీన్ను ఆమె భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు ఆమె సోదరుడు సాజిద్ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున తన సోదరి చనిపోయినట్టు సమాచారం అందిందని, ఆమె ఇంటికి వెళ్లి చూడగా పర్వీన్ మృతదేహం ఫ్యాన్కు వెలాడుతూ కనిపించిందని చెప్పాడు. తన సోదరి పర్వీన్ను ఆమె భర్త ముందు మొబైల్ ఛార్జర్తో గొంతు నులిమి హత్య చేసి.. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఫ్యాన్కు వేలాడదీశాడని సాజిద్ ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అన్వర్ను అదుపులోకి తీసుకున్నారు. పర్వీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పర్వీన్ పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.