మైనర్ బాలికతో వివాహం.. పోలీసుల ఎంట్రీతో ఆ యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-08-08T15:03:12+05:30 IST
మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం హల్చల్ చేశాడు. సేకరించిన వివరాల ప్రకారం... మంగళగిరి మండలం
పోలీస్ స్టేషన్ ఎదుట ఘటన
మైనర్ బాలికతో వివాహం నేపథ్యంలో..
మంగళగిరి(గుంటూరు): మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం హల్చల్ చేశాడు. సేకరించిన వివరాల ప్రకారం... మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన పారా కిరణ్బాబు కూలి పనులు చేస్తుంటాడు. చత్తీస్ఘడ్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన 15 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పరుచుకుని నెల కిందట పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఛత్తీస్ఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు నిడమర్రులో ఉన్నట్లు తెలియడంతో చత్తీస్ఘడ్ పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిడమర్రు గ్రామంలోని కిరణ్ ఇంట్లో తనిఖీ చేయగా బాలిక ఆచూకీ లభ్యమైంది. ఇద్దరినీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తనను చత్తీస్ఘడ్ తీసుకువెళితే ఇద్దరినీ దూరం చేస్తారనే భయంతో స్టేషన్ ఆవరణలోనే కిరణ్బాబు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. పెట్రోలు పోసుకునేలా ప్రేరేపించిన కిరణ్ బంధువు జయరావును మంగళగిరి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.