ఘనంగా సీతారాముల కల్యాణం
ABN , First Publish Date - 2022-04-11T01:22:31+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారల కల్యాణ మహోత్సవం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారల కల్యాణ మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా అర్చకులు తొలుత శ్రీసీతామచంద్రస్వామివారి ఆలయంలో మూలవిరాట్టులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో ఎల్.రమాదేవి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ ఛాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలోని అర్చకులు, వేదపండితుల బృందం ఉదయం 11.50 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు లక్షకు పైగా భక్తులు, శివపార్వతులు శ్రీసీతారాముల వివాహ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు.