Auto లో మరిచిన రూ.1.50 లక్షల విలువ చేసే పెళ్లి పట్టు చీరలు అందజేత

ABN , First Publish Date - 2022-01-01T20:48:21+05:30 IST

ఆటోలో మరిచిపోయిన పెళ్లి పట్టు చీరలను పంజాగుట్ట పోలీసులు బాధితులకు ...

Auto లో మరిచిన రూ.1.50 లక్షల విలువ చేసే పెళ్లి పట్టు చీరలు అందజేత

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : ఆటోలో మరిచిపోయిన పెళ్లి పట్టు చీరలను పంజాగుట్ట పోలీసులు బాధితులకు శుక్రవారం అందజేశారు. డీఐ కె.నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన డి.రామిరెడ్డి ఈ నెల 30న పెళ్లి పట్టు చీరలు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అమీర్‌పేటకు వచ్చారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ.1.50 లక్షల విలువ చేసే పట్టు చీరలు కొనుగోలు చేశారు. నగలు కొనుగోలు చేయడానికి ఆటోలో లాల్‌బంగ్లా నుంచి పంజాగుట్టకు కుటుంబ సభ్యులతో వెళ్లారు.  ఆటోలోనే పట్టుచీరల బ్యాగ్‌ను మరిచిపోయారు. కొద్దిసేపటి తరువాత చూసుకోగా పట్టు చీరల బ్యాగ్‌ కనిపించలేదు.


ఆటోలోనే మరిచిపోయినట్లు గుర్తించి, తాము వచ్చిన ఆటో కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. క్రైమ్‌ సిబ్బంది వెంటనే స్పందించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఎట్టకేలకు ఆటో నెంబర్‌ను గుర్తించారు. నెంబర్‌ ఆధారంగా శుక్రవారం ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడికి ఫోన్‌ చేశారు. ఆయన పట్టుచీరల బ్యాగ్‌ను పోలీస్‌స్టేషన్లో ఇచ్చాడు. వివరాలు పరిశీలించిన అనంతరం బాధితుడు రామిరెడ్డికి పోలీసులు బ్యాగ్‌ను అందజేశారు. ఆటో డ్రైవర్‌ను అభినందించారు. ఆటోలో ఎవరైనా విలువైన వస్తువులు మరిచిపోతే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో అందించాలని డీఐ నాగయ్య సూచించారు.


Updated Date - 2022-01-01T20:48:21+05:30 IST