మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-19T06:04:26+05:30 IST
పట్టణంలో నిర్మాణం చేపడుతున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు.
- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
మెట్పల్లి, మే 18: పట్టణంలో నిర్మాణం చేపడుతున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. బుధవారం పట్టణంలోని వెల్లుల రోడ్ ఖాదీ స్థలంలో నిర్మాణం చేపడుతున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6.50 కోట్ల నిధులతో మార్కెట్ నిర్మాణ పనులను చేపడుతున్నామని తెలిపారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత-సత్యనారాయణ, కమిషనర్ సల్వాది సమ్మయ్య, నాయకులు మార్గం గంగాధర్, సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్..
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ది కమిటీతో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కోరుట్లలో డయాలసీస్ సెంటర్, మెట్పల్లిలో బ్లడ్ బ్యాంక్లను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, మెట్పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.