మావోయిస్టు నేత జగన్‌ మృతి?

ABN , First Publish Date - 2021-06-23T08:22:53+05:30 IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ అలియాస్‌ లక్మూ అలియాస్‌ ధర్మన్న (56) మృతి చెందినట్లు సమాచారం.

మావోయిస్టు నేత జగన్‌ మృతి?

  • కరోనా బారిన పడి గుండెపోటుతో  కేంద్ర కమిటీ 
  • సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తుదిశ్వాస 
  • ధ్రువీకరించిన బస్తర్‌ ఐజీ, దంతెవాడ ఎస్పీ 
  • విషప్రయోగంతో చనిపోయినట్లు ప్రచారం! 
  • తలపై రూ.40 లక్షలు.. మావోయిస్టుల మౌనం


ఇల్లందు/భద్రాచలం/మహబూబాబాద్‌/చర్ల/చింతూరు, జూన్‌ 22: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ అలియాస్‌ లక్మూ అలియాస్‌ ధర్మన్న (56) మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీ్‌సగఢ్‌ బస్తర్‌ జిల్లా  అడవుల్లో సోమవారం రాత్రి (జూన్‌ 21న) ఆయన చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మృతి చెందారని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ ధ్రువీకరించారు. హరిభూషణ్‌ కొవిడ్‌ బారిన పడి, గుండెపోటుతో మృతి చెందారని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ పేర్కొన్నారు. అయితే హరిభూషణ్‌, ఛతీ్‌సగఢ్‌ సుక్మా జిల్లా మీనగుట్ట అటవీ ప్రాంతంలో విషతుల్యమైన ఆహారం తినడం వల్ల మృతి చెందారన్న ప్రచా రం జరుగుతోంది. ఆయన మృతి చెందినట్లుగా మా వోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. అయితే హరిభూషణ్‌ మృతి చెందినట్లుగా తమవద్ద విశ్వసనీయమైన సమాచారం ఉన్నట్లు మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షించే వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు హరిభూషణ్‌ మృతి చెందారన్నట్లుగా మంగళవారం సా యంత్రం దాకా తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు దయాకర్‌, ఐతు, ప్రకాశన్న లాంటి వారు కరోనాతో చనిపోయిన క్రమంలో ఆ వి షయాన్ని అధికారికంగా ప్రకటించిన మావోయిస్టులు, తాజాగా హరిభూషణ్‌ విషయంలో మౌనం వహించడంపై సస్పెన్స్‌ నెలకొంది. అయితే మావోయిస్టుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు పోలీసులే వ్యూహాత్మకంగా హరిభూషణ్‌ మృతి వార్తను ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 


అజ్ఞాతంలో ఉన్నప్పుడే పెళ్లి 

తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా మారడంతో హరిభూషణ్‌ తలపై రూ.40లక్షల రివార్డు ఉంది. ఆయన మృతి చెందారన్నట్లుగా ప్రచారం జరగడం ఇది నాలుగోసారి. హరిభూషణ్‌ సతీమణి సమ్మక్క, అలియాస్‌ శారదక్క ప్రస్తుతం రాష్ట్రస్థాయి బస్తర్‌ ప్రాంత నేతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అజ్ఞాతంలో ఉన్నప్పుడే సమ్మక్కను హరిభూషణ్‌ వివాహం చేసుకున్నారు. హరిభూషణ్‌ది ఆదివాసీ గిరిజన కుటుంబం. స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం గ్రామం. అసలు పేరు యాప నారాయణ. కొమ్మక్క-రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో ఆయన పెద్దవారు.  


మరో ఆరుగురికి అస్వస్థత

తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన కమిటీల్లోని చాలామంది సభ్యులు కరోనా బారిన పడి.. తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, మరో ఆరుగురు మావోయిస్టు నాయకులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని పోలీసులు చెబుతుండటం గమనార్హం. 


గెరిల్లా యుద్ధతంత్రంలో దిట్ట

మావోయిస్టుగా హరిభూషణ్‌ది 37 ఏళ్ల ప్రస్థా నం. పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో గట్టి పట్టు కలిగిన హరిభూషణ్‌ ఛత్తీ్‌సగఢ్‌లో పలు విధ్వంసాలకు వ్యూహకర్త అని, తెలంగాణలో అనేక సంచనల హింసాత్మక ఘటనలకు కారణంగా పేర్కొంటారు. నర్సంపేట సమీపంలోని సాయిరెడ్డిపల్లిలో పదో తరగతి వరకు చదివారు. నర్సంపేటలో ఇంటర్‌ చేశారు. వరంగల్‌ ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతూనే రాడికల్‌ విద్యార్థి, యువజన సంఘాల్లో పని చేశారు. మడగూడెం, నర్సంపేట, పాకలకొత్తగూడెం ఏరియాల్లో పీపుల్స్‌వార్‌, న్యూడెమోక్రసీల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న దశలో 1984లో హరిభూషణ్‌ పీపుల్స్‌వార్‌ దళంలో చేరారు. 


అప్పటి నుంచి 37 ఏళ్లుగా ఆయన గోదావరి లోయలో ఛత్తీ్‌సగఢ్‌, బస్తర్‌ ఏరియాల్లో పోలీసులకు కొరకరాని కొయ్యగా మారారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిగా, కేకేడబ్ల్యూ కమిటీలో, ఉత్తర తెలంగాణ స్పెషల్‌జోనల్‌ కమిటీ(ఎన్‌టీజెడ్సీ)లో మిలటరీ ప్లాటోన్‌ తెలంగాణ యాక్షన్‌ కమిటీ క మాండర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయం లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేసిన హరిభూషణ్‌ తదుపరి కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య శాంతి చర్చల సమయం లో హరిభూషణ్‌ ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ల్లో పీపుల్స్‌వార్‌ విస్తరణ కోసం విస్తృతంగా పనిచేశారు. హరిభూషణ్‌ స్వయంగా ఇల్లెందు, కొత్తగూడెం, ములుగు ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో సంచరించి దళాల్లో నియామకాలు పెంచారు. పీపుల్స్‌వార్‌ టార్గెట్లు పూర్తి చేయడంలో, యాక్షన్లు జరపడంలో దిట్టగా పేరుగాంచిన హరిభూషణ్‌ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందితే ప్రత్యర్థులు హడలిపోయేవారు. కాగా హరిభూషణ్‌ బాల్యంలో మంచి కబడ్డీ క్రీడాకారుడు అని నర్సంపేట ప్రాంతంలో గుర్తింపు ఉంది.  

Updated Date - 2021-06-23T08:22:53+05:30 IST