అంతర్జాతీయ వాలీబాల్ విజేత జట్టులో మన్యం కుర్రాడు
ABN , First Publish Date - 2022-01-21T05:34:52+05:30 IST
నేపాల్ దేశం ఖాట్మండులో బుధవారం జరిగిన ఇండో-నేపాల్ ఇన్విటేషన్ అంతర్జాతీయ వాలీబాల్ టోర్నీ ఫైనల్లో ప్రథమ విజేతగా నిలిచిన భారత జట్టులో మన్యం కుర్రాడు ప్రాతినిధ్యం వహించాడు.
దుమ్ముగూడెం,జనవరి20: నేపాల్ దేశం ఖాట్మండులో బుధవారం జరిగిన ఇండో-నేపాల్ ఇన్విటేషన్ అంతర్జాతీయ వాలీబాల్ టోర్నీ ఫైనల్లో ప్రథమ విజేతగా నిలిచిన భారత జట్టులో మన్యం కుర్రాడు ప్రాతినిధ్యం వహించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నందులచెలకకు చెందిన విద్యార్థి సోయం మహేష్కుమార్ జట్టులో ప్రతిభ కనబరిచి ఔరా అనిపించాడు. ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాల జట్లు పాల్గొనగా, ఫైనల్లో నేపాల్ జట్టుపై విజయం సాధించారు. ఈనెల 16నుంచి ఈ పోటీలు జరుగుతుండగా.. మహేష్ తన ఐదుగురు సహచర క్రీడాకారులతో పాటు ప్రతిభ కనబర్చి బంగారు పతకంతోపాటు షీల్డును దక్కించుకున్నాడు. అయితే ఈ పోటీల్లో తాను సత్తా చాటేందుకు కోచ్లు వికాస్, శివాజీలతోపాటు పలువురు ఎంతో సహకరించారని మహేష్ తెలిపాడు. ఇటీవల గోవాలో జరిగిన 5వ నేషనల్ యూత్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అండర్-17 వాలీబాల్ జట్టులో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన మహేష్ 400మీటర్ల పరుగు పందెం, షార్ట్పుట్లలో ప్రథమ బహుమతి సాధించడంతో పాటు మూడు బంగారు పతకాలు దక్కించుకున్నాడు.
ఉదయం వేళ ఆకాశంలో చుక్క
అశ్వారావుపేటరూరల్, జనవరి20: అశ్వారావుపేట, జీలుగుమిల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఓ వెలుగు చుక్క కనిపిచింది. దీన్ని ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. రెండు మూడు గంటల పాటు చందమామ కంటే తక్కువగా నక్షత్రానికి కంటే పెద్దదిగా తెల్లటి రంగులో దర్శనమిచ్చింది. ఆకాశం నుంచి దూసుకువస్తున్న గ్రహశకలమని కొందరు, ఇంకొకటని మరికొందరు చర్చించుకున్నారు. ఈవిషయం సోషల్ మీడియాలో పెద్ద అంశంగా మారింది. ఉదయం ఏడు గంటల నుంచి 11గంటల వరకు ఈప్రాంతంలోనే కనిపించిన చుక్క ఆకాశం ఆతర్వాత కనిపించకుండా పోయింది. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావటంతో భయాందోళనలు తగ్గాయి. అశ్వారావుపేట సరిహద్దులోని ఆంఽధ్రాలోని జీలుగుమిల్లి మండలంలోని తాటియాకులగూడెం గ్రామానికి చెందిన కొందరు యువకులు సంక్రాంతి సందర్భంగా మంటతో ఎగిరే పెద్ద బుడగను ఆకాశంలోకి వదిలినట్లుగా తేలింది. ఈవిషయం వాట్సాప్ల ద్వారా అందరికీ చేరటంతో ఆకాశంలో చుక్కపై వచ్చిన పుకార్లకు తెరపడింది.