సెలెక్షన్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ABN , First Publish Date - 2020-07-14T08:59:11+05:30 IST

భారత జట్టు ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందో? లేదో? తెలియాలంటే సెలెక్షన్‌ కమిటీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ...

సెలెక్షన్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

కోల్‌కతా: భారత జట్టు ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందో? లేదో? తెలియాలంటే సెలెక్షన్‌ కమిటీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ కోరాడు. ‘ప్రత్యక్ష ప్రసారం వల్ల ఏ సెలెక్టర్‌ ఏ ఆటగాడికి ఎందుకు మద్దతు పలుకుతున్నాడో అందరికీ తెలుస్తుంది. సాధారణంగా ఓ ఆటగాడు తనను ఎందుకు ఎంపిక చేయలేదని ఏ సెలెక్టర్‌నైనా అడిగితే వేరే సెలెక్టర్‌ వ్యతిరేకించాడని ఒకరిపై ఒకరు చెబుతుంటారు. ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఇలాంటి మాటలు చెప్పడానికి వాళ్లకు అవకాశం ఉండదు’ అని మనోజ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక, ఐపీఎల్‌ గురించి మాట్లాడుతూ ఈ లీగ్‌ వల్ల భారత క్రికెటర్ల కంటే విదేశీ బ్యాట్స్‌మెన్‌కే ఎక్కువ మేలు జరుగుతుందని మనోజ్‌ అన్నాడు. తొలి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం విదేశీ ఆటగాళ్లకే అధికంగా వస్తుండడంతో వారు చెలరేగుతున్నారని..ఐసీసీ టోర్నమెంట్లలో ఇది వారికి లాభిస్తుందని తెలిపాడు. ఆరేడు స్థానాల్లో భారత యువ ఆటగాళ్లను బరిలోకి దింపడం వల్ల వారు స్వేచ్ఛగా ఆడలేక ఒత్తిడికి లోనై విఫలమవుతున్నారని మనోజ్‌ చెప్పాడు.

Updated Date - 2020-07-14T08:59:11+05:30 IST