మధుర ఫలం.. మరింత ప్రియం
ABN , First Publish Date - 2022-05-10T05:23:54+05:30 IST
మామిడి ధరలు మండుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. రేట్లు చుక్కలనంటడంతో కొనుగోలు చేయడానికి ప్రజలు జంకుతున్నారు. ప్రజలు అమితంగా ఇష్టపడే దషేరి రకం మామిడి కిలో రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. కేసరి, బేనిసాన్ రకం కిలో రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. తోతాపరి కిలో రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న మామిడి ధరలు
నారాయణఖేడ్, మే 9: మామిడి ధరలు మండుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. రేట్లు చుక్కలనంటడంతో కొనుగోలు చేయడానికి ప్రజలు జంకుతున్నారు. ప్రజలు అమితంగా ఇష్టపడే దషేరి రకం మామిడి కిలో రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. కేసరి, బేనిసాన్ రకం కిలో రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. తోతాపరి కిలో రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.
తగ్గిన దిగుబడి
నారాయణఖేడ్ ప్రాంతంలో సంప్రదాయ మామిడి చెట్లు అధికంగా ఉంటాయి. నాలుగైదు సంవత్సరాలుగా మామిడి తోటల సాగు కూడా పెరిగింది. దీంతో మార్కెట్లో లభ్యత ఎక్కువగానే ఉంటున్నది. కానీ ఈ సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా పూత, కాత లేకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. పల్లెల్లో దేశీ మామిడి చెట్లకు అసలు కాతనే కాయలేదు. కొత్తగా వేసిన తోటల్లోనే కొంత పంట వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కూడా తక్కువగానే ఉండటంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ధర రెట్టింపయ్యింది.
పచ్చడి కాయలు కరువు
మామిడి తొక్కు కాయలకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉన్నది. మార్కెట్కు కాయలు ఎక్కువగా రాకపోవడంతో ధరలు మండుతున్నాయి. గత సంవత్సరం పచ్చడికి కాయ ఒకటి రూ.3కు విక్రయించగా, ప్రస్తుతం కాయ రూ.5 చొప్పున అమ్ముతున్నారు. చాలాచోట్ల పచ్చడి కాయల పేరిట మామూలు కాయలను కూడా అంటగడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ధరలు చుక్కలనంటడంతో ముందుముందు ఎలా ఉంటుందోనని ప్రజలు వాపోతున్నారు.