దుస్థితిలో మామిడి మార్కెట్‌ యార్డు..!

ABN , First Publish Date - 2020-07-09T12:05:54+05:30 IST

మామిడి మార్కెట్‌లో కోట్లాది రూపాయలు వ్యాపారం ఉన్నా అభివృద్ధి సున్నాగా మారింది.

దుస్థితిలో మామిడి మార్కెట్‌ యార్డు..!

 కోట్లాది రూపాయల వ్యాపారం ఉన్నా.. అభివృద్ధి సున్నా


రైల్వేకోడూరు, జూలై 8: మామిడి మార్కెట్‌లో కోట్లాది రూపాయలు వ్యాపారం ఉన్నా అభివృద్ధి సున్నాగా మారింది. ప్రతి ఏటా మట్టిరోడ్లనే నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఇది ఒకరకంగా కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారింది. వర్షం కురిసిందంటే చాలు మొత్తం మార్కెట్‌ అంతా బురదమయం అవుతుందని రైతులు వాపోతున్నారు. వాహనాలు తిరిగేందుకు కూడా వీలు లేకుండా ఉంటుందని తెలిపారు. కాలుతీసి కాలు పెట్టాలంటే నరకం తో సమానమని వాపోతున్నారు. ఒక వేళ వర్షం పడకుంటే దుమ్ము, ధూళి మామిడి కాయలపై పడుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు కాయలను ఎగుమతి చేస్తే దుమ్ము, ధూళి ఉన్న కారణంగా అవి చెడిపోతున్నాయని చెబుతున్నారు.


మామిడి యార్డులో సుమారు 70 మండీలు ఉన్నాయి. ఇక్కడ మామిడి సీజన్‌లో ప్రతి ఏటా 100 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోంది. మార్కెట్‌ గేట్‌ తదితరాలు వసూలు చేస్తారు. ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు లేవని రైతు లు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వ్యాపారులు కలసి షెడ్లు వేసుకున్నప్పటికీ దీని ద్వారా ఆదాయం పొందుతున్న ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి చేయడం లేదని  ఆవేదన చెందుతున్నారు. అధికారులు మామిడి మార్కెట్‌ యార్డులో సిమెంట్‌ రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-09T12:05:54+05:30 IST