జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుల పడిగాపులు
ABN , First Publish Date - 2021-06-20T06:23:21+05:30 IST
గంగాధరనెల్లూరు మండలం 100 గొల్లపల్లె జైన్ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు పడిగాపులు కాస్తున్నారు.
చిత్తూరు-పుత్తూరు రహదారిపై లోడ్ ట్రాక్టర్ల క్యూ
రెండ్రోజులపాటు కొనుగోలు చేయమని బోర్డు పెట్టిన యాజమాన్యం
సిఫార్సులతో వచ్చే వాహనాలను అనుమతించడంపై రైతుల ఆగ్రహం
గంగాధరనెల్లూరు, జూన్ 19: గంగాధరనెల్లూరు మండలం 100 గొల్లపల్లె జైన్ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వచ్చి రెండ్రోజులైనా ట్రాక్టర్లలో ఉన్న మామిడికాయలను అన్లోడింగ్ చేయడంలేదని, సిఫార్సులతో వచ్చేవారి వాహనాలను ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది అనుమతిస్తుండడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. మామిడి లోడ్తో వచ్చిన ట్రాక్టర్లు చిత్తూరు-పుత్తూరు రహదారి ఫ్యాక్టరీ వద్ద నుంచి కోటాగరం గ్రామానికి వెళ్ళే రోడ్డు వరకు బారులు తీరాయి. మామిడికాయల లోడ్తో వచ్చినవారికి అక్కడ భోజనాల సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. గంగాధరనెల్లూరు పంచాయతీలో 100గొల్లపల్లె, తూగుండ్రంకు వెళ్ళే రహదారిలో రెండు జైన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలకుగాను రోజుకు 1200 టన్నుల తోతాపురి మామిడికాయలను కొనుగోలు చేస్తున్నారు. తోతాపురి మామిడి టన్నుకు రూ.9వేలు ఫ్యాక్టరీ తరపున రైతులకు ధర నిర్ణయించి, కాయలు తోలిన తర్వాత 20రోజుల్లోగా రైతులకు డబ్బు చెల్లించేలా అంగీకరించినట్లు తెలిసింది. అయితే గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ట్రాక్టర్లలో మామిడికాయలను జైన్ఫ్యాక్టరీకి తరలించి క్యూలో పెట్టి రెండ్రోజులుగా అన్లోడింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా క్యూలో ఉన్న ట్రాక్టర్లల్లో రోజుకు 15 నుంచి 20 ట్రాక్టర్ల వరకు మాత్రమే తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, దామలచెరువు మామిడికాయల మండీల నుంచి వచ్చే మామిడికాయలను తీసుకుని, స్థానిక రైతులను రెండు మూడురోజులపాటు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. కొంతమంది వైసీపీ నేతలు జైన్ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బందితో కుమ్మక్కై ఫోన్లు చేసి మామిడికాయలు ఫ్యాక్టరీకి తేకముందే టోకెన్ నెంబర్లు వేసుకుని, తర్వాత వారి వాహనాలు క్యూలో నిలపకుండా అన్లోడింగ్ చేయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులు రోజూ ఫ్యాక్టరీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫ్యాక్టరీ గేటు ముందు శనివారం, ఆదివారం రైతులనుంచి మామిడికాయలను కోనుగోలు చేయడం లేదని నోటీసుబోర్డులో సిబ్బంది రాతపూర్వకంగా తెలియజేయడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.