పరిమళించిన మానవత్వం
ABN , First Publish Date - 2020-12-06T05:39:44+05:30 IST
కరోనా నేపథ్యంలో బంధువులు చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లేందుకు భయపడుతున్న నేటి రోజుల్లో ఓ అనాథ హిందూ మహిళ ప్రమాదవశాత్తూ గాయపడి చనిపోతే ముస్లిం యువకులు ఆమె పాడె మోసి అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
హిందూ మహిళ పాడె మోసిన ముస్లింలు
మంగళగిరి క్రైమ్, డిసెంబరు 5: కరోనా నేపథ్యంలో బంధువులు చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లేందుకు భయపడుతున్న నేటి రోజుల్లో ఓ అనాథ హిందూ మహిళ ప్రమాదవశాత్తూ గాయపడి చనిపోతే ముస్లిం యువకులు ఆమె పాడె మోసి అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరి పట్టణంలోని పార్కురోడ్డు ఐదో లైనుకు చెందిన వెనిగళ్ల సామ్రాజ్యం(59) శనివారం తెల్లవారుజామున అరుగు నుంచి జారి కిందపడటంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందింది. సామ్రాజ్యంకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పట్టణానికి చెందిన ఖిద్మత్ టీమ్ ముస్లిం యువకులు ముందుకువచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె పాడెను మోశారు. శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. యువకులను పలువురు అభినందించారు. కాగా మృతురాలు సామ్రాజ్యం అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రూ.10వేల ఆర్థికసాయాన్ని స్థానిక నేతల ద్వారా అందజేశారు.