నిర్వహణ నిధులు అందేదెప్పుడో..!
ABN , First Publish Date - 2021-10-05T05:02:50+05:30 IST
పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం కేటాయించే నిధులు సక్రమంగా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎఫ్ఎంస్ బిల్లులు నిలిచిపోవడంతో.. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.
- సీఎఫ్ఎంఎస్లో పెండింగ్ బిల్లులు
- ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు
(ఇచ్ఛాపురం రూరల్)
పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం కేటాయించే నిధులు సక్రమంగా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎఫ్ఎంస్ బిల్లులు నిలిచిపోవడంతో.. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లా సమగ్ర శిక్ష అధికారులు పాఠశాలల్లో చేసిన పనులకు రూ.వేలల్లో ఖర్చు చేసి బిల్లులు పెడితే.. ఖాతాల్లో నిధులు లేవని తెలిసి ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాదే నిధులు మంజూరు చేసింది. కానీ, చాలా పాఠశాలలకు ఇంతవరకు నిధులు జమ కాలేదు. గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల స్థాయిని బట్టి నిధులు కేటాయించేవారు. 2018-19 నుంచి విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు కేటాయిస్తారు. పాఠశాలల వారీగా అధికారులు నిధులు జమ చేస్తారు. 2020-21కి జిల్లాలో గత ఏడాది సెప్టెంబరులో విద్యార్థుల సంఖ్యను బట్టి కేటాయించారు. ముందుగా బిల్లులు పెట్టుకున్న 20శాతం పాఠశాలలు వీటిని వినియోగించుకున్నాయి. ఈ ఏడాది మార్చి తర్వాత పాఠశాలలకు సీఎఫ్ఎంఎస్లో బిల్లులు నిలిచిపోయాయి.
- నిర్వహణ నిధులే కాకుండా కాంప్లెక్స్ గ్రాంట్ కింద ఒక్కో సముదాయానికి రూ.21వేలు అందిస్తారు. జిల్లాలో పాఠశాల సముదాయాల నిర్వహణ, టీఎల్ఎం తయారీ తదితర అవసరాలకు వీటిని వెచ్చించాల్సి ఉంది.
- ఎమ్మార్సీ కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.60వేల చొప్పున కేటాయిస్తున్నారు. ఇవి కూడా ఇంకా జమ కాలేదు. దీంతో ఎలాంటి అవసరం ఉన్నా ప్రధానోపాధ్యాయులే చేతి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
నిధులు కేటాయింపు ఇలా
పాఠశాలల్లో 1-15 విద్యార్థులుంటే రూ.12,500, 16-100 ఉంటే రూ.25,000, 101-250 ఉంటే రూ.50 వేలు, 251-1000 మంది విద్యార్ధులుంటే రూ.75 వేలు, వెయ్యిపైన ఉంటే రూ.లక్ష వరకు నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను రెండేళ్లుగా పీడీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఖర్చు చేసిన బిల్లులు పెడితే సీఎఫ్ఎంఎస్ ద్వారా నిధులు జమవుతాయి. ప్రస్తుతం పీడీ ఖాతాల నుంచి నిధులు సీఎఫ్ఎంఎస్కు రాగానే ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా సమస్య ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ‘ఇటీవల పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు నిధులు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయులు ఖర్చు చేసి బిల్లులు పెట్టినా.. నిర్వహణ నిధులు జమ కాలేదు’ అని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీ.అనంతాచార్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు.
‘అమ్మఒడి’ డబ్బులు ఖర్చు చేయాలి
అమ్మఒడి డబ్బులు రూ.1000 చొప్పున పాఠశాల పీడీ ఖాతాల్లో ఉన్నాయి. ఆ నగదు నుంచి పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పనులకు ఖర్చు చేయాలి.
- జి.పగడాలమ్మ, ఇన్చార్జి డీఈవో, శ్రీకాకుళం