షాకింగ్.. మూడు నెలలుగా ఇంట్లోనే తండ్రి శవం.. ఓ కొడుకు చేసిన నిర్వాకమిది..!
ABN , First Publish Date - 2021-11-24T21:10:27+05:30 IST
మూడు నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి నిర్వాకం తాజాగా బయటపడింది.
మూడు నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి నిర్వాకం తాజాగా బయటపడింది. పక్కింటి వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్కు తరలించారు. అతను ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. కోల్కతాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కోల్కతాకు చెందిన సంగ్రామ్ (70) ఓ రిటైర్డ్ ఉద్యోగి. తన భార్య, కొడుకు కౌషిక్తో కలిసి కోల్కతాలో జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య పక్షవాతం కారణంగా కొద్ది రోజులుగా మంచానికే పరిమితమైంది. కాగా, మూడు నెలలుగా సంగ్రామ్ బయట కనిపించడం మానేశాడు. చుట్టు పక్కల వారు సంగ్రామ్ గురించి అడిగితే కొడుకు కౌషిక్ వారికి రోజుకో సమాధానం చెప్పేవాడు. చివరకు ఇటీవల తన పక్కింటి వ్యక్తికి అసలు నిజం చెప్పాడు. తన తండ్రి మూడు నెలల క్రితమే చనిపోయాడని, మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచానని చెప్పాడు.
సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు సంగ్రామ్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. కౌశిక్ను ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ చెబుతున్న సమాధానాలు పోలీసులకు కూడా షాక్ కలిగిస్తున్నాయి. తన తండ్రి చనిపోలేదని, త్వరలోనే కళ్లు తెరుస్తాడని కౌశిక్ పోలీసులకు చెప్పాడు. దీంతో కౌశిక్ మానసిక రోగి అని పోలీసులు భావిస్తున్నారు. తన కొడుకు దగ్గర అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవని, అందుకే మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశాడని అతడి తల్లి పోలీసులకు చెప్పింది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసులో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.