Bhopal: భార్య, ఆమె ప్రియుడ్ని పొడిచి చంపిన భర్త
ABN , First Publish Date - 2022-07-19T21:27:52+05:30 IST
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జంట హత్యల ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరొకరితో..
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జంట హత్యల ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకున్న ఓ వ్యక్తి ఆ ఇద్దర్నీ మార్గమధ్యంలోనే అటకాయించి కత్తితో పొడిచి చంపాడు. సోమవారం రాత్రి భోపాల్లోని కైలాష్ నగర్ సెమ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్టేషన్ ఇన్చార్జి అలోక్ శ్రీవాస్తవ కథనం ప్రకారం, హత్యకు గురైన ఆమె ఇటీవల తన భర్తను విడిచిపెట్టి మరొకరితో సహజీవనం చేస్తోంది. తన ఐదేళ్ల కుమార్తెను తన దగ్గరే ఉంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆ ఇద్దరు ఉండే ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. సోమవారం రాత్రి తన భార్య, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి, కుమార్తె ఒక బైక్పై రావడం గమనించాడు. హఠాత్తుగా వారిపైకి దూకి భార్య, ఆమె ప్రియుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తెను మాత్రం అతను విడిచిపెట్టేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.