ఐదుగురిని కాల్చిచంపిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2020-04-06T03:50:42+05:30 IST

తన ఇంటి వద్ద గుమిగూడిన ఐదుగురిని దారుణంగా కాల్చిచంపేశాడో వ్యక్తి.

ఐదుగురిని కాల్చిచంపిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్!

మాస్కో: తన ఇంటి వద్ద గుమిగూడిన ఐదుగురిని దారుణంగా కాల్చిచంపేశాడో వ్యక్తి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. తీరా వారిని ఎందుకు చంపావని అడిగితే.. నిందితుడు చంపిన కారణం విని షాకయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన రష్యాలోని ర్యాజన్ ప్రాంతంలో జరిగింది. తన ఇంటి ముందు కొంతమంది వ్యక్తులు గుమిగూడి పెద్దగా మాట్లాడుకోవడం నిందితుడు విన్నాడు. ఇంటి బాల్కనీలోకి వచ్చి కింద ఉన్న వాళ్లతో వాగ్వాదం పెట్టుకున్నాడు. అతని మాటలు పట్టించుకోని ఆ బృందం, మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆ ఇంటి యజమాని.. తుపాకీ తీసుకొచ్చి ఆ బృందంపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో బృందంలోని నలుగురు యువకులు, ఓ యువతి దుర్మరణం పాలయ్యారు.


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-06T03:50:42+05:30 IST