గ్రహాల శాంతి పూజల పేరుతో టోకరా.. వ్యాపారి భార్యను మోసం చేసి కిలోన్నర బంగారం స్వాహా..

ABN , First Publish Date - 2022-03-18T05:53:58+05:30 IST

సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా చాలా మంది గ్రహ శాంతులు, క్షుద్ర పూజలను నమ్ముతున్నారు. అమాయకంగా తమ దగ్గరున్న డబ్బులు, నగలను పోగొట్టుకుంటున్నారు...

గ్రహాల శాంతి పూజల పేరుతో టోకరా.. వ్యాపారి భార్యను మోసం చేసి కిలోన్నర బంగారం స్వాహా..

సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా చాలా మంది గ్రహ శాంతులు, క్షుద్ర పూజలను నమ్ముతున్నారు. అమాయకంగా తమ దగ్గరున్న డబ్బులు, నగలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇండోర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రహ శాంతుల పేరుతో ఓ వ్యక్తి తన స్నేహితురాలైన వ్యాపారి భార్యను మోసం చేశాడు. ఆమె నుంచి ఏకంగా కిలోన్నర బంగారం కాజేశాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. 


వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని రాహుల్ జైన్ అనే వ్యాపారి భార్య సంగీతం నేర్చుకోవడానికి రోజూ వెళ్లేది. అక్కడ ఆమెకు కిషోర్ సంఘ్వీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ తరచుగా ఫోన్లు చేసుకునేవారు. వాట్సాప్‌ల్లో ఛాటింగ్ చేసుకునేవారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఆమెకు ఫోన్ చేసిన కిషోర్ ఓ షాకింగ్ విషయం చెప్పాడు. తమ ఇంట్లో అందరికీ కరోనా సోకిందని, అందరూ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయామని, ఆ సమయంలో గ్రహశాంతులు చేయించడం వల్ల తిరిగి కోలుకున్నామని చెప్పాడు. 


దీంతో రాహుల్ భార్య కూడా ఆ పూజల గురించి అడిగింది. ఇంట్లో ఉన్న మొత్తం బంగారం పెట్టి ఆ పూజలు చేయాలని కిషోర్ ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె తన ఇంట్లో ఉన్న కిలోన్నర బంగారాన్ని కిషోర్‌కు ఇచ్చి తమ పేరు మీద గ్రహశాంతి పూజలు చేయించాలని అడిగింది. అయితే ఆ బంగారం తిరిగి ఇవ్వమని ఆమె అడిగినపుడు కిషోర్ రకరకాల సాకులు చెప్పి తప్పించుకునే వాడు. తను పూజారికి నగలు ఇచ్చానని, అతను ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పాడు. దీంతో ఆమె తన భర్త రాహుల్‌కు విషయం చెప్పింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-03-18T05:53:58+05:30 IST