ఎవరు పొరుగువాడు?
ABN , First Publish Date - 2020-06-12T05:30:00+05:30 IST
ఒకసారి ఏసు ప్రభువు వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడు, ‘‘బోధకుడా! నేను స్వర్గానికి వెళ్ళాలంటే, శాశ్వతమైన జీవాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి?’’ ‘‘పవిత్ర గ్రంథంలో రాసి ఉన్నదేమిటి? నువ్వేం అనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడు ఏసు...
ఒకసారి ఏసు ప్రభువు వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడు, ‘‘బోధకుడా! నేను స్వర్గానికి వెళ్ళాలంటే, శాశ్వతమైన జీవాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి?’’
‘‘పవిత్ర గ్రంథంలో రాసి ఉన్నదేమిటి? నువ్వేం అనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడు ఏసు.
‘‘పూర్తి హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, మొత్తం శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మనల్ని ప్రేమించుకున్నట్టే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి’’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు.
‘‘అవును. ఆ పని చెయ్యి! నువ్వు స్వర్గంలో శాశ్వతంగా జీవిస్తావు’’ అన్నాడు ఏసు.
‘‘మరి నా పొరుగువారంటే ఎవరు? అని అడిగాడు ఆ వ్యక్తి.
ఏసు ప్రభువు చిరునవ్వు నవ్వుతూ, ‘‘ఒక కథ చెబుతాను విను. ఒక యూదుడు రోడ్డు మీద నడిచి పోతున్నాడు. అతను జెరూసలేమ్ నుంచి జెరికో వైపు వెళుతున్నాడు. నడిచి వెళితే ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణం. ఆ రహదారి రాళ్ళతో, చిన్న గుట్టలతో నిండి ఉంది. అతను కూనిరాగాలు తీసుకుంటూ నడుస్తూ ఉండగా, ఒక గుట్ట వెనుక నుంచి కొందరు మనుషులు అతని మీదకు వచ్చి పడ్డారు. అతని వస్తువులన్నీ లాక్కున్నారు. దుస్తులు చించేశారు. తమ వెంట వచ్చి, జాడలు కనిపెడతాడేమోనని అతణ్ణి చితక్కొట్టారు. ఆ యూదుడు రోడ్డు పక్కన నెత్తురోడుతూ పడి ఉన్నాడు.
కొన్ని నిమిషాల తరువాత, దైవకార్యాలు చేసే యాజకుడొకరు అదే దారిలో వచ్చాడు. ఆ యూదుణ్ణి చూశాడు. తల తిప్పుకొని, ఏదీ చూడనట్టుగా ముందుకు సాగిపోయాడు. మరో గంట తరువాత, యాజకులకు దైవకార్యాల్లో సహకరించే లెవీయుడొకరు ఆ వైపు వచ్చి, యూదుణ్ణి చూసి, ఏ సాయమూ చెయ్యకుండా వెళ్ళిపోయాడు.
కొంతసేపటి తరువాత సమరయుడొకరు ఆ వైపు వచ్చాడు. యూదులకూ, సమరయులకూ పడదు. సమరయులను యూదులు చిన్నచూపు చూస్తారు. కానీ రోడ్డు పక్కన పడి ఉన్న యూదుణ్ణి గమనించగానే, ఆ సమరయుడు అతని దగ్గరకు వెళ్ళాడు. గాయాలకు నూనె, ద్రాక్ష రసం పూశాడు. కట్లు కట్టాడు. తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. అతణ్ణి ఒక సత్రంలో చేర్చాడు. మర్నాడు ఆ సమరయుడు మళ్ళీ తిరిగి వచ్చి, సత్రం నడిపే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ యూదుడు కోలుకొనే వరకూ జాగ్రత్తగా చూసుకోవాలనీ, అవసరమైతే మరికొంత డబ్బు ఇచ్చి వెళతాననీ చెప్పాడు. ఇదీ కథ.’’
కథ ముగించిన ఏసు ప్రభువు ఆ వ్యక్తిని అడిగాడు - ‘‘దొంగల చేతుల్లో దెబ్బలు తిని, గాయపడిన యూదుడికి ఆ ముగ్గురు వ్యక్తులలో పొరుగువాడు ఎవరు?’’
‘‘అతని పట్ల జాలిపడి, సాయం చేసినవాడే!’’ అని చెప్పాడు ఆ వ్యక్తి.
‘‘వెళ్ళు! నువ్వూ అదే విధంగా సాయం చెయ్యి’’ అన్నాడు ఏసు క్రీస్తు.