అయ్యో పాపం.. చాయ్ తాగితే బతికేవాడు..!
ABN , First Publish Date - 2021-10-23T16:54:36+05:30 IST
అయ్యో పాపం.. చాయ్ తాగితే బతికేవాడు..!
- రోడ్డు ప్రమాదంలో మేస్త్రీ మృతి
- టీ తాగమని బావమరిది
- అడిగినా ఆగకుండా వెళ్లి మృత్యువాత
హైదరాబాద్ సిటీ/దుండిగల్ : పొట్టకూటికోసం బైక్పై కొండాపూర్కు బయలుదేరిన ఓ వ్యక్తిని మార్గమధ్యంలో ఓ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. చాయ్ కోసం ఆగమన్నప్పడు ఆగి ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో..? అంటూ బావ మరిది వాపోతున్నాడు. ప్రకాశం జిల్లా, దర్శికి చెందిన శ్రీరాం వెంకటయ్య కుమారుడు శ్రీను (38), కత్తిమోహన్ బావ, బావమరుదలు. వీరు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం, జీడిపల్లి గ్రామంలో నివాసముంటున్నారు. మేస్ర్తీలుగా పనిచేస్తున్నారు.
శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కొండాపూర్లో పని చేయడానికి వేర్వేరు బైక్లపై బయలుదేరారు. మోహన్ టీ తాగటానికి గండిమైసమ్మ చౌరస్తాలో బైక్ను ఆపి టీ కొట్టుకు వెళ్లాడు. తాను టీ తాగనని, మెల్లిగా వెళ్తుంటానని ‘నువ్వు తాగి వచ్చేయ్’ అని చెప్పి శ్రీను వెళ్లాడు. బాచుపల్లి రోడ్డులోని హమారా దాబా దగ్గర వెళ్లేసరికి రెడీమిక్స్ వాహనం శ్రీనును వెనుక నుంచి ఢీకొట్టింది. వాహనం అతడి తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.