ఒకే మండపంపై ఇద్దరు ప్రియురాళ్లతో పెళ్లి.. అమ్మాయిలకు ఇష్టమేనట..!

ABN , First Publish Date - 2021-01-08T03:12:43+05:30 IST

ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడు ఒకే రోజు, ఒకే వేదికపై ఆ ఇద్దర్నీ వివాహం చేసుకున్నాడు. ఈ నెల ..

ఒకే మండపంపై ఇద్దరు ప్రియురాళ్లతో పెళ్లి.. అమ్మాయిలకు ఇష్టమేనట..!

జగదల్పూర్: ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడు ఒకే రోజు, ఒకే వేదికపై ఆ ఇద్దర్నీ వివాహం చేసుకున్నాడు. ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది. దాదాపు 600 మంది బంధువుల ఈ పెళ్లికి హాజరుకాగా.. దీని తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన చందు మౌర్య వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. మూడేళ్ల క్రితం అతడు సుందరి కశ్యప్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. రోజూ ఫోన్లో మాట్లాడుకోవడం ద్వారా మరింత దగ్గరైన వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఓ ఏడాది గడిచేలోపే వీరి ప్రేమ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఓ బంధువు పెళ్లికి వెళ్లిన చందు అక్కడ హసీనా అనే మరో యువతిని ఇష్టపడ్డాడు. తాను అప్పటికే ఓ యువతిని ప్రేమించానని చెప్పినప్పటికీ.. హసీనా తరచూ చందుకు ఫోన్ చేసి మాట్లాడేది.  ‘‘హసీనా, సుందరి ఇద్దరికీ ఈ విషయం తెలియడంతో.. ఇద్దరూ నాతోనే జీవించేందుకు  అంగీకరించారు. మేము ముగ్గురం ఫోన్ల ద్వారా రిలేషన్ కొనసాగించినప్పటికీ.. ఓ రోజు హసీనా నా ఇంటికి వచ్చేసింది. ఆమె వచ్చిన విషయం తెలుసుకుని సుందరి కూడా నా దగ్గరికి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి అందరం ఒకే ఇంట్లో కుటుంబంలాగా కలిసి జీవిస్తున్నాం..’’ అని చందు ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ వివరించాడు.  ఇద్దరు మహిళలతో ఎలా ఉంటావంటూ గ్రామస్తులు అతడిని నిలదీయడంతో... వారిద్దరినీ వివాహం చేసుకునేందుకు చందు సిద్ధమయ్యాడు. ‘‘ఆ ఇద్దరూ నన్ను ప్రేమించారు. వారిని నేను మోసం చేయలేను. వాళ్లిద్దరూ నాతోనే జీవించేందుకు అంగీకరించారు..’’ అని చందు పేర్కొన్నాడు. కాగా ఈ పెళ్లికి హాజరయ్యేందుకు హసీనా బంధువులు రాగా.. అక్కడి నుంచి సుందరి బంధువులు వెళ్లిపోవడం కొసమెరుపు! 



Updated Date - 2021-01-08T03:12:43+05:30 IST