ఇయర్ ఫోన్స్ పేలుడు.. గుండెపోటుతో యువకుడి మరణం!
ABN , First Publish Date - 2021-08-07T21:38:32+05:30 IST
ఇయర్ ఫోన్స్ పేలిపోవడంతో రాకేశ్ నగర్ అనే యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. జైపూర్ జిల్లాలోని ఉదయ్పూరియా గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.
జైపూర్: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలిపోవడంతో రాకేశ్ నగర్ అనే యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. జైపూర్ జిల్లాలోని ఉదయ్పూరియా గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. చార్జింగ్లో ఉన్న హెడ్ఫోన్స్ను రాకేశ్ పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు అతడు స్పృహతప్పిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. ఈ ఘటనలో బాధితుడి రెండు చెవులూ దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. అతడు గుండెపోటుతో మరణించి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. రాకేశ్ ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం నాడు అతడు చదువుకుంటుండగా ఈ దారుణం జరిగింది.